Soldiers Village in Karnataka : సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. తమ కలను నెరవేర్చుకుని సాయుధ దళాల్లో చేరి విశిష్ట సేవలందించిన సైనికులు ఎంతో మంది ఉన్నారు. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలు అందించారు. ఇలా సైనికులు దేశంలో చాలా చోట్ల ఉంటారు. అయితే, దేశానికి సేవ చేయాలనే నిబద్దతకు ఓ గ్రామమే కట్టుబడి ఉందంటే నమ్ముతారా? నిజమే ఆ గ్రామంలో మొత్తం 250మందికి పైగా ప్రస్తుతం సైన్యంలో ఉన్నారు. అంతేకాకుకండా 90 మందికిపైగా సైనికులు పదవీ విరమణ చేశారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందంటే?
కర్ణాటక బెళగావి జిల్లాలోని ఇంచల్ గ్రామం. ఈ గ్రామం నుంచే 250 మందికి పైగా సైనికులు దేశానికి సేవ చేస్తున్నారు. 90మంది మాజీ సైనికులు ఉన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీలో పని చేస్తున్నారు. కొంతమంది ఆర్మీలో ఉన్నత పదవులకు వెళ్లారు. ఒకరు బ్రిగేడియర్ కాగా, మరొకరు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు.
ప్రతి ఇంట్లో ఉపాధ్యాయులు
అయితే ఈ గ్రామం నుంచి కేవలం సైనికులు మాత్రమే కాదు. ఆధిక సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్న ఘనత కూడా ఉంది. ఇంచల్లో దాదాపు ప్రతి ఇంటికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. వారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. దీంతో అటు సైనికులతో పాటు ఉపాధ్యాయులను అందిస్తున్న గ్రామంగా ఇంచల్ పేరుపొందింది. డాక్టర్ శివానంద భారతి స్వామిజీ దయ వల్లే ఇంచల్ గ్రామం రూపురేఖలే మార్చేశారని స్థానికులు చెబుతున్నారు.

శివానంద భారతి స్వామీజీ దయ వల్లే
ఇంచల్ గ్రామంలో శ్రీ శివయోగీశ్వర సాధు సంస్థాన్ ప్రసిద్ధి. శ్రీ స్వామిజీ దయ వల్లే గ్రామంలో విద్యా విప్లవం జరిగింది. ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్, ఇంటర్, గ్రాడ్యుయేట్, డీఈడ్,బిఎఎంఎస్ కళాశాలలను ప్రారంభించారు. ఫలింతగా అందరూ మంచిగా చదువుకున్నారు. 2006లో శ్రీ శివయోగేశ్వర్ ఎక్స్-సర్వీస్మెన్ అసోసియేషన్ స్థాపించారు. ఇక్కడ సైన్యంలో ఎందుకు చేరాలి? అందుకు ఎలా సిద్ధం కావాలి, అక్కడ ఎలా పని చేయాలని మాజీ సైనికులు యువతకు తెలియజేస్తున్నారు. ఫలితంగా సంవత్సరానికి కనీసం 10 మంది యువత సైన్యంలో చేరుతున్నారు.
ఒకే కుటుంబంలో 15మంది సైనికులు
మొదట్లో ఇంచల్ నుంచి ముగ్గురు మాత్రమే సైన్యంలో చేరేవారని ఆ సంక్య క్రమంగా పెరుగుతూ వచ్చిందని మాజీ సైనికుడు బసవన్నెప్ప జకతి ఈటీవీ భారత్కు తెలిపారు. సైనికులు సెలవుల కోసం గ్రామానికి వచ్చినప్పుడు వారు ధరించిన యూనిఫాం, క్రమశిక్షణా జీవితం మిగతవారికి స్పూర్తినిచ్చాయని అన్నారు. అయితే ప్రస్తుతం, మాజీ సైనికులు కలిపి ఒకే కుటుంబలో 15మంది ఉన్నట్లు మాజీ సైనికుడు సంగనాయక బగనవర్ అన్నారు. 24 సంవత్సరాలు సేవలందించి రెండేళ్ల క్రితమే రిటైర్ అయ్యారని చెప్పారు. మళ్లీ పిలిచిన వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

'పాక్తో యుద్ధానికి సిద్ధమే'
డాక్టర్ శివానంద భారతి స్వామిజీ ఆశీస్సుల వల్లే ఇంచల్ గ్రామం మారిపోయిందని మరో మాజీ సైనికుడు రుద్రప్ప బాగేవాడి అన్నారు. ఉపాధ్యాయులతో పాటు సైనికుల సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు. 'నేను 27 సంవత్సరాలు సేవలందించి రిటైర్ అయ్యాను. ఇప్పుడు మా గ్రామ యువతను సైన్యంలో చేరడానికి మార్గనిర్దేశం చేస్తున్నా. ప్రస్తుతం పాకిస్థాన్తో విబేధాలు తలెత్తాయి. ఈ సమయంలో మమ్మల్ని ఆహ్వానిస్తే, వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. యూనిఫాం ధరించినప్పుడు, మనలో గొప్ప శక్తి వస్తుంది. యుద్ధం వచ్చినప్పుడు, వెనక్కి తగ్గడం అనే ప్రశ్న ఉండదు. శత్రువుల నుదిటిపై కాల్చి ముందుకు సాగుతాం" రుద్రప్ప అన్నారు.
దేశానికి సేవ అంటే దేవుడికి చేసినట్లే
ఆర్మీ బ్రిగేడియర్ యల్లనగరం మల్లూర తండ్రి దొడ్డనాయక మల్లూర మాట్లాడతూ, తన కుమారుడు జీవితం మొత్తం దేశం కోసమే అంకితం చేశాడని అన్నారు. 'కార్గిల్ యుద్ధంలో కాల్పులకు గురయ్యారు. అయినప్పటికీ శుత్రువులతో పోరాటడంలో వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో తిరిగి వచ్చేయాలని అడిగాం. అందుకు అంగీకరించలేదు. దేశానికి సేవ చేయడం అంటే దేవుడిని చేసినట్లే అని చెప్పి సైన్యంలో కొనసాగుతున్నారు' అని దొడ్డనాయక మల్లూర తెలిపారు.
భారత అమ్ములపొదిలో 'భార్గవాస్త్ర'- టెస్ట్ ఫైర్ సూపర్ సక్సెస్
రక్షణ ఎగుమతుల్లో భారత్ రయ్ రయ్- పదేళ్లలో 34 రెట్లు పెరిగిన ఎక్స్పోర్ట్స్