Judges Protect Freedom Of Speech : "ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే, ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే" అని సుప్రీంకోర్ట్ వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హి వివాదాస్పద వీడియో పోస్ట్కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 'వాక్ స్వాతంత్య్రం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగమని, దాన్ని రక్షించడం కోర్టుల విధి' అని స్పష్టంచేసింది.
అసలేం జరిగిందంటే?
గుజరాత్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హి గతేడాది తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 46 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఇమ్రాన్ ఓ పెళ్లి వేడుక మధ్యలో నడిచివస్తుండగా ఆయనపై పూలవర్షం కురుస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఓ పద్యం కూడా వినిపిస్తుంటుంది. అయితే, ఆ పద్యంలోని పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని పలు ఆరోపణలు వచ్చాయి. దీనితో ఆయనపై కేసు నమోదైంది.
ఈ కేసును కొట్టివేయాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం గుజరాత్ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఎలాంటి నేరం లేకపోయినా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా వాక్ స్వాతంత్ర్యంపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
"కవిత్వం, నాటకం, సినిమాలు, వ్యంగ్యం, కళలు, సాహిత్యం లాంటివన్నీ మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం సాధ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలను, ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే, అవి సహేతుకంగా ఉండాలే తప్ప, ఊహాజనితంగా ఉండకూడదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువ మంది వ్యతిరేకించినా సరే, ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సి ఉంటుంది. వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కును కాపాడటం న్యాయస్థానాల విధి" అని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీపై నమోదైన కేసును సుప్రీంకోర్ట్ కొట్టేసింది.