Fake Currency Printing Press : రాజస్థాన్ జోధ్పుర్లో నకిలీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ను నడుపుతున్న ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కరెన్సీ ప్రింటింగ్ ఫ్యాక్టరీలో రూ.7.5 లక్షల విలువైన నకిలీ నోట్లను, కరెన్సీ ముద్రణకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
మాండోర్ మండిలో నకిలీ కరెన్సీ ప్రింటింగ్ ఫ్యాక్టరీని కొందరు నిర్వహిస్తున్నారు. ఫలితంగా జోధ్ పుర్ పరిసర ప్రాంతాల్లో రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు చలామణి అవుతున్నాయి. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ప్రింటింగ్ ప్రెస్పై దాడులు జరిపి ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులిద్దర్ని బాల్ సమంద్లోని వారి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కూడా సోదాలు నిర్వహించారు. రూ.2 లక్షల నగదును ఇస్తే నిందితులు రూ.10 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులు ఇలా చేస్తున్న సమయంలో డీసీపీ అలోక్ శ్రీవాస్తవ సంఘటనా స్థలంలోనే ఉన్నారు.
"కొంతకాలంగా మాండోర్ మండిలో నకిలీ నోట్ల చెలామణి అవుతున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో దొంగ నోట్ల ముఠాను గుట్టురట్టు చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించాం. మంగళవారం మాండోర్ మండిలోని ఒక ప్రదేశంలో నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నారని సమాచారం అందింది. ఈ క్రమంలో దాడులు జరిపి నాగౌర్ జిల్లాలోని పంచోడికి చెందిన రాజేంద్ర వ్యాస్(28), భవండా వాసి హనుమాన్రామ్ ప్రజాపత్ (40)ను అరెస్ట్ చేశాం. వారి నుంచి రూ.7.5 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నాం. అంతేకాకుండా కంప్యూటర్, స్కానర్, సిరా, కాగితం మొదలైన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. నిందితులను అదుపులోకి తీసుకుని మహామందిర్ పోలీస్ స్టేషన్కు తరలించాం."
--అలోక్ శ్రీవాస్తవ, డీసీపీ
ఇన్ఫార్మర్ క్లూతో గుట్టురట్టు
జోధ్పుర్లో నకిలీ నోట్ల చెలామణీపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం ఒక ఇన్ఫార్మర్ పోలీసులకు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ గురించి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు పక్కాగా దాడులు జరిపి దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నారు. ఈ నకిలీ ప్రింటింగ్ ప్రెస్ వెనుక మరికొందరి హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఉగ్రదాడికి ముందు రోజే పర్యాటకుడితో మాట్లాడిన టెర్రరిస్ట్- ఏమని అడిగాడో తెలుసా?
భారత్లో ఐస్క్రీములు అమ్ముతున్న పాకిస్థాన్ మాజీ ఎంపీ- ఎందుకో తెలుసా?