Jammu Kashmir Terrorist Attack : మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం పర్యటనకు వచ్చిన వారిపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. అయితే, స్థానిక వ్యాపారులు చొరవ తీసుకుని పలువురు పర్యటకులను రక్షించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కాపాడినట్లు పర్యాటకులు చెబుతున్నారు.
ఛత్తీస్గఢ్కు చెందిన మహేంద్ర గఢ్ చిర్మిరీ భరత్పుర్ ప్రాంతానికి చెందిన నాలుగు కుటుంబాలు పహల్గాం పర్యటనకు వెళ్లాయి. ఉగ్రగదాడి జరిగిన సమయంలో శివాన్ష్ జైన్, కుల్దీప్ స్తాపక్, అర్విందర్ అగర్వాల్, హ్యాప్పీ బద్వాన్ కుటుంబాలకు చెందిన 11మంది అక్కడే ఉన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 18న వీరందరూ చిన్నారులతో సహా విహార యాత్రకు వెళ్లారు. ఏప్రిల్ 21న పహల్గాం చేరుకున్నట్లు కుల్దీప్ బంధువు రాకేశ్ తెలిపారు. అయితే, కొండచరియలు విరిగిపడడం వల్ల రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయిందని, ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారని వివరించారు. ఈ సమయంలోనే కాల్పులు జరిగాయని, దీంతో భయపడిన పర్యాటకులు పరుగులు తీసినట్లు వెల్లడించారు. వీరిని గమనించిన స్థానిక కశ్మీరీ వ్యాపారి నజకత్ అలీ సమయస్ఫూర్తిని ప్రదర్శించి, పర్యాటకుల 11 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కాపాడినట్లు తెలిపారు. నజకత్ అలీ ప్రతి ఏడాది శీతల కాలంలో ఉన్ని దుస్తులు విక్రయించేందుకు చిర్మిరికి వస్తుంటాడని వారు పేర్కొన్నారు.


"కుల్దీప్ స్తాపక్, అతడి భార్యతో పాటు అనేక మంది పహల్గాం పర్యటనకు వెళ్లారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఉగ్ర దాడి జరిగిన సమయంలో వీరంతా అక్కడే ఉన్నారు. దీంతో భయపడి లాడ్జ్ వైపు వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి సురక్షితంగా జమ్ముకు వచ్చారని చెప్పారు. కశ్మీర్ నుంచి చిర్మిరికి వచ్చి వ్యాపారాలు చేసుకునేవారు వీరిందరిని సురక్షితంగా పంపించడంలో సాయం చేశారు."
--రాకేశ్ పరాశర్, కుల్దీప్ బంధువు
"నా కొడుకు, కోడలు, మనవడు కలిసి పహల్గాం పర్యటనకు వెళ్లారు. వారితో పాటు ముగ్గురు స్నేహితుల కుటుంబాలు అక్కడికి వెళ్లాయి. ఉగ్రదాడి జరగడంతో భయపడ్డాం. వారికి ఫోన్ చేయగా తామంతా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు".
--శివాన్ష్ జైన్ తల్లి
పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులను చుట్టుముట్టి, అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఘటన నేపథ్యంలో ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది.
