Jammu Kashmir Encounter : పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే జమ్ము కశ్మీర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కుల్గామ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకరంగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భారత్ సైన్యం మట్టుబెట్టిన కొన్ని గంటలకే తంగ్మార్గ్ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ కీలక కమాండర్ భద్రతా బలగాలకు చిక్కినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, మంగళవారం పహల్గాం ఘటనకు పాల్పడింది తామేనంటూ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ప్రకటించుకుంది.
పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
అంతకుముందు బుధవారం ఉదయం జమ్ము కశ్మీర్లోని బారాముల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించగా భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతం చేశాయి. అనంతరం ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా ఎవరైనా ముష్కరులు ఉన్నారా అన్న అనుమానంతో ఉగ్రవేట కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నట్టు అనుమనిస్తున్నారు.
ఉగ్రవాదుల ఊహ చిత్రాలు విడుదల
పహల్గాం సమీప బైసరన్ లోయలో మంగళవారం ఉగ్రవాదులు చేసిన భీకర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులను చుట్టుముట్టి, అతి సమీపం నుంచి కాల్పులు చేశారు. ఈ ఘటన అనంతరం ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోగా, వారి కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఘటన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. మరోవైపు పహల్గాం ఉగ్ర దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించాయి.