India Vs China Weapons : భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మినీ వార్లో వివిధ దేశాలు తయారు చేసిన డ్రోన్లు, యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులను తొలిసారి యుద్ధ రంగంలో వినియోగించారు. వీటిలో భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థలు సత్తా చాటగా, పాక్ వినియోగించిన చైనా ఆయుధ వ్యవస్థలు తుస్సుమన్నాయి. దీనితో పాక్లోని ఉగ్రస్థావరాలు, మిలటరీ బేస్లను ధ్వంసం చేసిన బ్రహ్మోస్ క్షిపణికి ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా భారీగా డిమాండ్ పెరిగింది.
భారత్ సత్తా
ఆయుధాల తయారీ తర్వాత వాటిని సైన్యంలో చేర్చుకోవడానికి ముందు ఎన్ని పరీక్షలు నిర్వహించినా, యుద్ధ రంగంలో పరీక్షించినప్పుడే వాటి సిసలైన సత్తా బయటపడుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మినీ వార్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు ఉత్పత్తి చేసిన ఆయుధాలకు అసలైన పరీక్షలా నిలిచింది. తద్వారా ఏ ఏ ఆయుధాల సత్తా ఎంత? భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? అనే రోడ్మ్యాప్ను సిద్ధం చేసుకునేందుకు ఉపయోగపడనుంది. క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇలా అనేక అస్త్రశస్త్రాలను భారత్-పాక్ మినీ వార్లో వినియోగించారు. అరడజనుకుపైగా భారత్, చైనా ఆయుధాలను యుద్ధ రంగంలో తొలిసారి ఉపయోగించారు. ఫ్రాన్స్, తుర్కియే, రష్యా, ఇజ్రాయెల్, చైనా ఆయుధాల సత్తా ఏపాటిదో ఆపరేషన్ సిందూర్ ద్వారా అర్థమైంది. ఈ ఆయుధాల పనితీరును ప్రపంచ వ్యాప్తంగా ఆయుధ కంపెనీలు, నిపుణులు నిశితంగా పరిశీలించారు. భవిష్యత్ యుద్ధాల ప్రణాళికలు, ఆయుధ వ్యూహాల రూపకల్పనకు ఇది ఉపయోగపడనుంది.
ఎదురులేని 'బ్రహ్మోస్'
బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణిని తొలిసారి యుద్ధ రంగంలో భారత్ పరీక్షించింది. సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ యుద్ధ విమానంతో కలిపి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు శత్రువుల స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇది భారత్కు ఎంతో గర్వకారణంగా నిలిచింది. పాక్ గగన తల రక్షణ వ్యవస్థను దాటుకుని బ్రహ్మోస్ క్షిపణి వందల కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది. మినీ వార్లో రఫేల్ యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణి గేమ్ చేంజింగ్ కాంబోగా నిలిచింది. సూపర్ సోనిక్ వేగం, స్టెల్త్ సామర్థ్యం, కచితత్వంతో దాడి చేయగల సత్తా బ్రహ్మోస్ను తిరుగులేని అస్త్రంగా నిలిపాయి. వచ్చే 12 నుంచి 18 నెలల్లో మరింత అధునాతనమైన కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణి అందుబాటులోకి రానుంది.
ఫుల్ డిమాండ్
భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని ఇప్పటికే ఫిలిప్పీన్స్ కొనుగోలు చేసింది. వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, అర్జెంటినా దేశాలు సైతం ఈ క్షిపణిపై ఆసక్తి చూపుతున్నాయి. 1998లో బ్రహ్మోస్ క్షిపణి కార్యక్రమానికి భారత్ శ్రీకారం చుట్టగా 25 ఏళ్ల తర్వాత నిజమైన యుద్ధంలో వీటిని తొలిసారి పరీక్షించారు. ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా ఉత్పత్తి చేసిన బరాక్-8 ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని కూడా మినీవార్లో వాడారు. పాకిస్థాన్ ప్రయోగించిన ఫతా-2 బాలిస్టిక్ క్షిపణిని సిర్సా వద్ద బరాక్-8 క్షిపణే అడ్డుకున్నట్లు సమాచారం. భారత్ ప్రయోగించిన అస్త్రాలు అంతర్జాతీయ సరిహద్దు దాటడమేకాకుండా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయని అంతర్జాతీయ ఆయుధ నిపుణులు చెబుతున్నారు. చైనాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైనట్లు తెలిపారు.
భారత్ దెబ్బకు పాక్ విలవిల
ఫ్రాన్స్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు, హ్యామర్, స్కాల్ప్ క్షిపణులు కూడా తొలిసారి యుద్ధ రంగంలో సత్తా చాటాయి. 1979 నుంచి చైనా ప్రత్యక్ష యుద్ధాల్లో పాల్గొనకపోయినా చైనా ఆయుధ వ్యవస్థలను పాకిస్తాన్ ఈ మినీవార్లో వినియోగించింది. చైనాకు చెందిన యుద్ధ విమానాలు జే-10, జేఎఫ్-17లను, హెచ్క్యూ-9, హెచ్క్యూ-16, పీఎల్-15లను పాక్ వినియోగించింది. చైనాకు చెందిన హెచ్క్యూ-9 డిఫెన్స్ వ్యవస్థ భారత్ దాడులను అడ్డుకోలేకపోయింది. చైనా తయారీ పీఎల్-15 ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా ఆయుధాల పనితీరును అమెరికా నిశితంగా గమనిస్తోంది. భారత్ చేసిన గగన దాడులను, టెక్నికల్ స్ట్రైక్లను ఇప్పుడు అమెరికా తన తైవాన్ వ్యూహాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.
డ్రోన్ ఎటాక్
ఈ మినీ వార్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. భారత్ తొలిసారి "నాగస్త్ర-1"తో పాటు ఇజ్రాయిల్తో కలసి తయారు చేసిన "స్కై స్ట్రైకర్" డ్రోన్లను వాడింది. ఈ డ్రోన్లు టార్గెట్ ఎంచుకొని వాటిపై పడిపడి పేలిపోతాయి. ఇవి శత్రుదళాలపై ఎక్కువ ప్రభావం చూపాయి. పాకిస్థాన్ కూడా టర్కీ తయారీ డ్రోన్లను, చైనా తయారీ క్షిపణులను ఉపయోగించింది. కానీ, ఈ యుద్ధంలో భారత డ్రోన్లు, క్షిపణులే పైచేయి సాధించాయి. ఆకాశ్ తీర్, ఎస్-400 సహా భారత గగనతల రక్షణ వ్యవస్థలు సత్తా చాటి శత్రు దాడుల ముప్పును తప్పించాయి.
సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం స్పెషల్ ఆపరేషన్- పేలని బాంబులు, అర్టిలరీ నిర్వీర్యం
ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు- అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్