India Pakistan War : జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవేళ ఈ పరిస్థితులు మరింత తీవ్రరూపు దాలిస్తే యుద్ధం జరిగే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారు ? భారత్కు బేషరతుగా మద్దతు ప్రకటిస్తారా? ట్రంప్ వైఖరి ఎలా ఉండొచ్చు? అనే దానిపై అంతటా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అమెరికా ప్రయోజనాలే పరమావధి అంటున్న ట్రంప్ భారత్- పాక్లో ఏ దేశం వైపు మొగ్గుచూపుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. భారత సంతతికి చెందిన ముక్తదర్ ఖాన్ ప్రముఖ విదేశీ వ్యవహారాల నిపుణుడు. అమెరికాలోని డెలావర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సేవలందిస్తున్న ఈయన ఈ అంశంపై 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన విశ్లేషణను చూద్దాం.
పాకిస్థాన్పై ట్రంప్కు ఆసక్తేం లేదు
'ట్రంప్ విషయానికొస్తే, పాకిస్తాన్పై ఆయనకు ప్రత్యేక ఆసక్తేం లేదు' అని విదేశీ వ్యవహారాల నిపుణుడు ముక్తదర్ ఖాన్ పేర్కొన్నారు. 'భారతదేశానికి అమెరికా మద్దతు విషయానికొస్తే మీరు ముందుకు సాగండి. మేం మీతోనే ఉంటామని చెబుతారు. అయితే ట్రంప్ నుంచి మరీ ఎక్కువగా మనం ఆశించలేం. ఎందుకంటే ఆయన అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై, ఆర్థిక సంక్షోభం నుంచి తన దేశాన్ని గట్టెక్కించడంపై ఫోకస్ పెట్టారు. ఇంకొంత కాలం పాటు ట్రంప్ ఇదే విధమైన విధానంతో ముందుకుసాగే అవకాశం ఉంది. ఇతర దేశాల వ్యవహారాల్లోకి అమెరికా తలదూర్చకపోవచ్చు' అని ముక్తదర్ ఖాన్ విశ్లేషించారు.
'అంతర్జాతీయ స్థాయిలోనూ పాకిస్థాన్ పూర్తిగా ఒంటరిగా మిగిలింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC), సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్ ఇలా ఏ దేశమూ పాకిస్తాన్కు సహాయం చేయడానికి ఇష్టపడవు' అని ఆయన అభిప్రాయపడ్డారు. 'పాకిస్థాన్ విషయంలో భారత్ తీవ్రస్థాయిలో స్పందిస్తే అంతర్జాతీయ ఒత్తిడితో ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. స్వల్ప స్థాయిలో భారత్ స్పందిస్తే ట్రంప్ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. భారత్ను కీలక వాణిజ్య భాగస్వామిగా, మిత్రదేశంగా అమెరికా చూస్తోంది' అని ముక్తదర్ ఖాన్ చెప్పారు.
ఏం చేయాల? భారత సర్కారు సందిగ్ధం!
'పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్కు వ్యతిరేకంగా ఎలా స్పందించాలనే దానిపై భారత్ సందిగ్ధతను ఎదుర్కొంటోంది? ప్రస్తుతం అమెరికా సుంకాల విధానం యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత్ను కూడా ప్రభావితం చేస్తోంది. ఈనేపథ్యంలో భారత ప్రధాని మోదీ ముందున్న సవాలు ఏమిటంటే పాకిస్థాన్పై ఏదైనా తీవ్ర చర్యను తీసుకుంటే, పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ వల్లే జరిగిందని అంతర్జాతీయ స్థాయిలో నిరూపించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తే, పాకిస్తాన్ కూడా స్పందిస్తుంది' అని ప్రొఫెసర్ ముక్తదర్ ఖాన్ తెలిపారు.
'గత కొన్ని సంవత్సరాలుగా కశ్మీరులో జరుగుతున్న ఘటనలు, ఉగ్రవాద దాడుల విషయంలో భారతదేశం స్పందించిన తీరు కారణంగా ప్రజల అంచనాలు పెరిగాయి. అందుకే పహల్గామ్ దాడి తర్వాత భారత్ సంక్లిష్ట సమయాన్ని చూస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్పై పెద్ద స్థాయిలో చర్యలు తీసుకోకపోతే, దేశ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి రావచ్చు' అని ఆయన చెప్పారు.
చిన్నపాటి యుద్ధం వర్సెస్ పూర్తి స్థాయి యుద్ధం
'ఒకవేళ పాకిస్థాన్పై భారత్ చిన్నపాటి యుద్ధం చేస్తే అది పాకిస్థాన్కే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపాటి యుద్ధంలో అక్కడి ప్రజలు సైన్యానికి, ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు. ఒకవేళ భారత్ పూర్తి స్థాయి యుద్ధం చేస్తే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. దాని ఆస్తులు మునిగిపోతాయి. అది భారీ నష్టాలను చవిచూస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ దాదాపు 10 నుంచి 15 ఏళ్లు వెనక్కి నెట్టబడుతుంది. ఇలాంటి యుద్ధంలో భారత్కూ ఆర్థిక నష్టాలు తప్పవు' అని ముక్తదర్ ఖాన్ తెలిపారు.
'అందుకే పాకిస్థాన్పై భారత్ చేయబోయే యుద్ధం అంతర్జాతీయ సమస్యగా మారేంత పెద్దదిగా ఉండకూడదు. పాకిస్థాన్ ప్రయోజనం పొందేంత చిన్నదిగానూ ఆ యుద్ధం ఉండకూడదు. ఈ సంక్లిష్టమైన సవాలుపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది' అని ఆయన చెప్పుకొచ్చారు. 'పహల్గామ్ ఉగ్రదాడి అమానుషం. పాకిస్థాన్కు భారత్ తగిన గుణపాఠాన్ని నేర్పాలి అనేది నా అభిప్రాయం' అని ముక్తదర్ ఖాన్ పేర్కొన్నారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ గురి
'అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోకి ప్రవేశించే మొదటి దేశంగా భారత్ నిలిచే అవకాశం ఉందని అమెరికా ఆర్థికశాఖ మంత్రి ఇటీవలే తెలిపారు. బహుశా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు ముందే.. అమెరికాకు భారత్ రాయితీలను ప్రకటించి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. గత వారమే భారతదేశం 7.4 బిలియన్ డాలర్లు విలువైన రాఫెల్ యుద్ధ విమానాలను కొనేసింది. ఈవిషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫ్రాన్స్కు చెందిన రాఫెల్స్ కోసం భారత్ చేసిన భారీ ఖర్చును అమెరికా గమనించలేదు. మరి అమెరికాకు చెందిన ఎఫ్35 యుద్ధ విమానాల కోసం భారత్కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?' అని ముక్తదర్ ఖాన్ తెలిపారు.
'భారతదేశం ఇకపై అనవసరమైన వస్తువులను కొనదని ట్రంప్కు బాగా తెలుసు. అయినా అమెరికా వాణిజ్య లోటును భర్తీ చేయడానికి ట్రంప్ ఖచ్చితంగా కొంత వ్యాపారం చేయాలని భారత్ను డిమాండ్ చేయొచ్చు' అని ఆయన అంచనా వేశారు.
భారత్ సమ్మిట్ గురించి ఏమన్నారంటే
హైదరాబాద్లో జరిగిన భారత్ సమ్మిట్ గురించి 'ఈటీవీ భారత్' ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రొఫెసర్ ఖాన్ ఇలా స్పందించారు. 'నేను భారత్ సమ్మిట్లో పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాను. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రగతిశీల స్వరం. ప్రజాస్వామిక వ్యవస్థలు బలహీనపడుతున్న ప్రస్తుత తరుణంలో ఇండియా సమ్మిట్ లాంటి ప్రగతిశీల స్వరాలు వినిపించడం ఆనందకరం. ఇలాంటి విషయాల్లో అందరూ కలిసికట్టుగా పోరాడాలి' అని ఆయన పేర్కొన్నారు.
పాక్కు నిలిపేసిన సింధూ జలాలను భారత్కు నిల్వచేయడం సాధ్యమా?
కశ్మీరీ పండిట్లే ఉగ్రవాదుల టార్గెట్?- ఫుల్ అలెర్ట్లో ఇండియన్ ఆర్మీ