Earthquake Prediction Scientist : ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు పెరిగిపోయాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి ఏటా వేలాది మంది ప్రాణాలు వదులుతున్నారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగినప్పటికీ, భూకంపాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ సైంటిస్ట్ రేడియో తరంగాల సాయంతో భూకంపాలను అంచనా వేస్తున్నారు. అదేలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆరేళ్లుగా కచ్చితమైన అంచనా
కొల్హాపుర్లోని ఇచల్కరంజికి చెందిన ప్రసన్న వైచల్ ఎలక్ట్రానిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. భారత్, విదేశాలలో ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలపై పరిశోధనలు చేశారు. విద్యా బోధన, పరిశోధనల రూపకల్పనలపై గత పాతికేళ్లుగా రీసెర్చ్ చేసిన అనుభవం వైచల్ కు ఉంది. అయితే తాను స్వయంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలలో భూకంపాలను అంచనా వేయడానికి భూమి కింద ఉన్న రేడియో తరంగాలను అధ్యయనం చేస్తున్నారు. గత ఆరేళ్లుగా ఆయన భూకంపాలు ఎప్పుడు వస్తాయో కచ్చితంగా అంచనా వేస్తున్నారు.
35 ఏళ్లుగా భూకంపాలపై అధ్యయనం
వైచల్ గత 35ఏళ్లుగా భూకంపాలపై పరిశోధనలు చేస్తున్నారు. భూకంపాలను అంచనా వేయడానికి తన ప్రయోగశాలలో రిసీవర్, మైక్రో కంప్యూటర్లు, గూగుల్ను ఉపయోగిస్తారు. కోయ్నా డ్యామ్ వద్ద భూకంపాన్ని తాను అంచనా వేశానని, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు సమాచారం కూడా అందించానని వైచల్ చెప్పారు.
"జపాన్, తైవాన్, అఫ్గానిస్థాన్, ఫిలిప్పీన్స్, నేపాల్, భూటాన్లో ఎక్కువ భూకంపాలు సంభవిస్తున్నాయి. నేను కాల్ సైన్ VU3OOIతో లైసెన్స్ పొందిన అమెచ్యూర్ రేడియో ఆపరేటర్ను కూడా. చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ (VLF) ఉన్న మల్టీపాత్ మల్టీ ఫ్రీక్వెన్సీ ప్రాపగేషన్ సాంకేతికతను ఉపయోగించి భూకంపాలను అంచనా వేయడానికి ఒక పద్ధతిని కనుగొన్నాను. భూమి వాతావరణం రెండు భాగాలుగా విభజించారు. భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండేది దిగువ వాతావరణం. పైకి కనిపించేది ఎగువ వాతావరణం" అని వైచల్ తెలిపారు.

అయనీకరణ ప్రక్రియలో భాగంగా పాజిటివ్ అయాన్లు, నెగెటివ్ ఎలక్ట్రాన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ అయనీకరణ పొరను అయానోస్పియర్ అంటారు. వాతావరణ సాంద్రత, ఎత్తును బట్టి ఎలక్ట్రాన్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఇవి వివిధ ఎలక్ట్రాన్ల సాంద్రత ఉన్న పలు పొరలకు చేరుతుంది. దిగువ నుంచి పైకి డీ పొర సుమారు 60కి.మీ-90కి.మీ ఎత్తులో ఉంటుంది. తరువాత ఈ పొర దాదాపు 90-150కి.మీ, ఎఫ్ 1 పొర 150-250కి.మీ, ఎఫ్ 2 250-350కి.మీ ఎత్తులో ఉంటాయి. రాత్రి సమయంలో అయనీకరణ ఆగిపోతుంది. దీంతో డీ పొర అదృశ్యమవుతుంది. ఎఫ్1, ఎఫ్2 ఒకే పొరలో విలీనం అవుతాయి. ఈ క్రమంలో కొన్ని పొరలు రేడియో సిగ్నల్ లను గ్రహిస్తాయి.
ఫ్రీక్వెన్సీ ఇంకా ఎక్కువగా ఉంటే అది అయానోస్పియర్ గుండా బాహ్య అంతరిక్షానికి వెళుతుంది. డీ పొర హెచ్ఎఫ్ బ్యాండ్ లోని చాలా రేడియో సిగ్నల్స్ను గ్రహిస్తుంది. కానీ ఈ, ఎఫ్1, ఎఫ్2 పొరలు కొన్ని ఫ్రీక్వెన్సీలను ప్రతిబింబిస్తాయి. ఇది తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఉన్న పరిస్థితులపై ఆధారపడి మారుతుంది. భూకంపాలను ముందుగానే అంచనా వేయడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులతో తన అనుభవాలు, సాంకేతికతను పంచుకోవాలనుకుంటున్నట్లు వైచల్ చెప్పారు.
చార్ ధామ్ యాత్రకు 'ఉగ్ర' భయాలు- భక్తుల భద్రతపై సర్కార్ అలర్ట్!
'గౌతమ్ గంభీర్ను చంపేస్తాం'- టీమ్ఇండియా హెడ్కోచ్కు ISIS బెదిరింపులు