Pahalgam Attack Terrorist House Destroyed : పహల్గాం ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లల్లో పేలుడు సంభవించింది. ఆసిఫ్ పౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ థోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదులు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే భద్రతా దళాలలు సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ పేలుళ్లు సంభవించాయని, త్రుటిలో తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు.
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల నివాసాల్లో భద్రతా దళాలు తఖీలు నిర్వహించింది. ఈ క్రమంలోనే దక్షిణ కశ్మీర్లోని త్రాల్కు చెందిన ఆసిఫ్ షేక్ ఇంటికి వెళ్లగా, అక్కడ పేలుడు పదార్థాలు ఉన్నాయని గుర్తించారు. అయితే అవి యాక్టివేట్ అయినట్లు తెలియడం వల్ల అప్రమత్తమైన సిబ్బంది బయటకు వచ్చేశారు. కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. ఇదే విధంగా అనంత్ నాగ్ జిల్లాలోని బిజ్బెహారా బ్లాక్లోని గురి గ్రామానికి చెందిన ఆదిల్ గురి నివాసంలోనూ పేలుడు సంభవించింది. గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో ఆర్మీ జవాన్లకు హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లల్లో పేలుడు పదార్థాలు అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కావాలనే ఈ నివాసాల సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిల్ గురి 2018లో చట్టబద్ధంగా పాకిస్థాన్ వెళ్లి, గతేడాది జమ్ముకశ్మీర్కు తిరిగి వచ్చాడని అధికారులు తెలిపారు. జమ్ముకు రాకముందు అక్కడ ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందాడని వెల్లడించారు. పహల్గాం ఉగ్ర దాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల స్కేచ్లను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్నేమ్లు కూడా ఉన్నట్లు తెలిపింది. ఆదిల్ థోకర్ అనే మరో ఉగ్రవాదికి కూడా వీరితో సంబంధం ఉందని దర్యాప్తు బృందాలు తెలిపాయి. వీరందరూ జమ్ముకశ్మీర్ కేంద్రంగా పనిచేసే 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'లో సభ్యులని చెప్పాయి. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ ఊహా చిత్రాలను గీసినట్లు పేర్కొన్నాయి.