Supreme Court On Child Trafficking Case : నవజాత శిశువుల అక్రమ రవాణా కేసుల విషయంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కనబరుస్తున్న తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆసుపత్రిలో అయినా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే వెంటనే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులతోపాటు ప్రభుత్వానికి మంగళవారం కఠిన మార్గదర్శకాలు నిర్దేశించింది.
అసలేం జరిగిందంటే?
ఇటీవల ఉత్తర్ప్రదేశ్లోని ఓ ఆసుపత్రిలో నవజాత శిశువు అపహరణకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారిని విక్రయించాడు. అయితే నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు నిరాశే మిగిలింది. కేసును పై విచారించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
'విచారణ ఎలా కొనసాగుతుందో తెలియజేయాలి'
తాజాగా ఈ కేసును సుప్రీంకోర్టు విచారించింది. చిన్నారుల అక్రమ రవాణా కేసులపై యూపీ ప్రభుత్వ తీరు, నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టుపై సీరియస్ అయింది. అక్రమ రవాణా పెండింగ్ కేసులకు సంబంధించి విచారణ ఎలా కొనసాగుతోందో తెలియజేయాలని దేశవ్యాప్తంగా హైకోర్టులను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నిందితుడి బెయిల్ రద్దు చేసింది.
'విచారణ ఆరు నెలల్లోపు పూర్తి కావాలి'
ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలల లోపు పూర్తిచేయాలని, రోజూవారీ విచారణను కూడా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కుమారుడిని పొందేందుకు ఆశపడిన నిందితుడు, రూ.4 లక్షలకు చిన్నారిని పొందాడని వ్యాఖ్యానించింది. ఒకవేళ నిజంగా బిడ్డ కావాలని అనుకుంటే అక్రమ రవాణా చేసేవారిని సంప్రదించాల్సింది కాదని పేర్కొంది. ఆ చిన్నారిని దొంగతనం చేసి తనకు అందించారనే విషయం నిందితుడికి బాగా తెలుసని చెప్పింది. ఇలాంటివారు సమాజానికి ముప్పు అని వ్యాఖ్యానించింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ధర్మాసనం తెలిపింది.