Israel Envoy Pahalgam Attack : జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడితో భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రెవెన్ అజర్ పోల్చారు. ఈ రెండు దాడులు పౌరులనే లక్ష్యంగా చేసుకుని జరిగాయని, ఉగ్రవాదు గ్రూపుల మధ్య సమన్వయం పెరుగుతోందని హెచ్చరించారు.
'ఉగ్రవాదులు అన్ని స్థాయిల్లో పరస్పరం సహకరించుకుంటున్నారు. అందుకోసం వారు ఒకరికొకరు అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఉగ్రవాద సంస్థలు ఒకరిని ఒకరు ప్రేరేపించుకుంటున్నాయని మనం అంగీకరించాలి. పహల్గాం ఉగ్రదాడికి, 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న అమాయకులైన పర్యాటకులపై దాడి జరిగితే, ఇజ్రాయెల్ ప్రజలు సంగీత వేడుక జరుపుకుంటున్నప్పుడు ఈ దాడులు జరిగాయి. పహల్గాం దాడి జరగక ముందు ఇటీవల హమాస్ నాయకులు పాక్ ఆక్రమిత్ కశ్మీర్ (పీఓకే)లో పర్యటించారు. అక్కడ వారు జైషే మహ్మద్ కార్యకర్తలతో సమావేశమైనట్టు సమచారం. దీనికి పహల్గాం దాడి మధ్య సంబంధం ఉండొచ్చు' అని రెవెన్ అజర్ అనుమానం వ్యక్తం చేశారు.
పహల్గాం దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించిన విధానాన్ని, ముఖ్యంగా బీహార్లోని మధుబని సభలో ఆయన చేసిన ప్రసంగాన్ని రెవెన్ అజర్ ప్రశంసించారు. 'భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించడం తీసుకున్న కఠినమైన చర్యలు, హెచ్చరికలు నాకు ఎంతో ధైర్యం కలిగించాయి. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న దేశాలను ప్రపంచం బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉగ్రవాదాన్ని దేశాలు నిధులు, ఇంటెలిజెన్స్ సమాచారం, ఆయుధాల రూపంలో మద్దతు ఇస్తున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదు’ అని రెవెన్ అజర్ స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడిపై జీ20దేశాల రాయబారులతో భేటీ
మరోవైపు ఈ పహల్గాం ఉగ్రదాడి, పాకిస్థాన్ చర్యల గురించి భారత్ జీ 20 దేశాలకు సమాచారం అందించింది. గురువారం దిల్లీలో ఉన్న జీ20 దేశాల రాయబారులతో పాటు వ్యూహాత్మక భాగస్వాములతో సమావేశమైన భారత్ కార్యకదర్శి విక్రం మిస్రీ ఈ మేరకు వివరించారు. అలాగే, ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న విధానాన్ని గురించి కూడా తెలిపారు.