Tahawwur Rana Extradition Timeline: ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా ఎట్టకేలకు భారత్కు చేరుకున్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత భారత్ చేతికి చిక్కాడు. అయితే, ఆ దాడికి కీలక సూత్రధారుల్లో ఒకడిగా భావిస్తున్న తహవూర్ హుస్సేన్ రాణాను పలు కేసుల్లో భాగంగా అమెరికా గతంలోనే అరెస్టు చేసింది. కాగా, ముంబయి దాడి కేసులో విచారణకు అతడిని భారత్కు తీసువచ్చేందుకు దాదాపు 14ఏళ్ల సమయం పట్టింది. మరి ఇంత సమయం ఎందుకు పట్టిందో తెలుసా?
బాల్య స్నేహితులు
26/11 దాడికి సూత్రధారి అయిన పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రాణా చిన్ననాటి మిత్రుడు. హెడ్లీ తల్లి అమెరికా దేశస్థురాలు కాగా తండ్రి పాక్ దౌత్యవేత్త. బాల్యంలో పాకిస్థాన్లో గడిపిన హెడ్లీ, రాణాతో కలిసి సైనిక పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం అమెరికా వెళ్లినప్పటికీ పాక్ ఉగ్రసంస్థతో హెడ్లీ సంబంధాలను అలానే కొనసాగించాడు. ఈ క్రమంలోనే బిజినెస్ కన్సల్టెంట్గా భారత్లో పలుమార్లు పర్యటించగా, ఇతడికి తన ఇమిగ్రేషన్ సంస్థ తరఫున తహవూర్ సాయం చేసినట్లు తెలుస్తోంది.
ఎఫ్బీఐకి చిక్కి
ముంబయి దాడులు జరిగిన ఏడాది అనంతరం 2009 అక్టోబరులో అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్బీఐ) చేతికి రాణా దొరికాడు. లష్కర్-ఏ-తొయిబా (LeT)తోపాటు డెన్మార్క్ వార్తా పత్రిక కార్యాలయాలపై దాడికి కుట్ర పన్నాడనే ఆరోపణలపై షికాగోలో అతడిని అరెస్టు చేశారు. అనంతరం లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధంలో పెట్టారు.
అయితే, ఉగ్రదాడికి సంబంధించి ముంబయి పోలీసులు 2009లో వేసిన తొలి ఛార్జిషీటులో రాణా పేరు ప్రస్తావించలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2011లో వేసిన ఛార్జిషీట్లో మాత్రం తొలిసారి అతడి పేరును చేర్చింది. ఈ దాడికి ప్రధాన కుట్రదారుల్లో రాణాను ఒకడిగా తెలిపిన ఎన్ఐఏ, 26/11 దాడికి సూత్రధారి అయిన పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రవాణా పరంగా, ఆర్థికంగా ఎలా సాయం చేశాడనే వివరాలను స్పష్టంగా వివరించింది. దాడికి రెండేళ్ల ముందే లక్షిత ప్రదేశాల్లో హెడ్లీ రెక్కీ నిర్వహించినట్లు సమచారం.
దౌత్య ప్రయత్నాలు
మరోవైపు రాణాను తీసుకువచ్చేందుకు దౌత్య ప్రయత్నాలు మొదలుపెట్టిన భారత్, అతడిని అప్పగించాలని కోరుతూ అమెరికా ప్రభుత్వానికి 2019లో లేఖ రాసింది. అనంతరం అతడి అరెస్టు వారెంటును కోరుతూ 2020లో అభ్యర్థించగా కాలిఫోర్నియా కోర్టు అందుకు అనుమతిని ఇచ్చింది. అయితే, ఇప్పటికే ఒకేవిధమైన ఆరోపణలపై రెండుసార్లు ఎలా విచారిస్తారంటూ రాణా తరఫు న్యాయవాదులు వాదించినా, కోర్టు తోసిపుచ్చింది. అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ కూడా భారత్కు రాణాను అప్పగించేందుకు అంగీకారంత తెలిపారు.
అడ్డుకునేందుకు పిటిషన్లు
తనను భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక న్యాయస్థానాల్లో రాణా అనేక పిటిషన్లు వేశాడు. ఈ సమయంలోనే శాన్ ఫ్రాన్సిస్కోలోని అప్పీల్ కోర్టు అప్పగింతపై ఆదేశాలు ఇవ్వడంతో చివరకు నవంబర్ 2024లో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఆ రివ్యూ పిటిషన్ను ఈ ఏడాది జనవరి 21న అమెరికా సర్వోన్నత న్యాయస్థానం కూడా తోసిపుచ్చడంతో రాణాను భారత్కు అప్పగించడం అనివార్యమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు రోజు (ఫిబ్రవరి 11న) ఇదే అంశంపై మాట్లాడిన విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రాణాను భారత్కు అప్పగించే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆరోగ్య కారణాలను చూపుతూ అప్పగింతను నిలిపివేయాలని జిల్లా కోర్టులు సహా సుప్రీంను ఆశ్రయించినప్పటికీ అవి తిరస్కరణకు గురికావడంతో చివరకు భారత్కు చేరుకున్నాడు.