Flag Pole At Ayodhya Ram Mandir : అక్షయ తృతీయ 2025 నేపథ్యంలో అయోధ్య రామమందిరంపై జెండా పోల్ను ప్రతిష్టించారు. ఆలయ శిఖరంపైన జెండా స్తంభాన్ని సంప్రదాయల ప్రకారం కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. 42 అడుగుల పొడవైన ఈ స్తంభాన్ని హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ శుక్ల ద్వితీయ ముహూర్తంలో ఉదయం 8గంటలకు పెట్టినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కాగా, ఉదయం 8 గంటలకు పూర్తైనట్లు వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
త్వరలోనే మండపాల నిర్మాణం పూర్తి
మరోవైపు అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఏడు మండపాల నిర్మాణం పూర్తి కానున్నట్లు చంపత్ రాయ్ చెప్పారు. రామ్ దర్బార్లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో శివాలయం, నైరుతి మూలలో సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు వివరించారు. 2025 అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే అయోధ్య రామాలయ మొదటి అంతస్తులో సీత, లక్ష్మణ, హనుమాన్, భరత, శతృఘ్న సమేతుడైన శ్రీరాముని పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



ఇటీవలె అయోధ్యలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేసేలా 80 మీటర్ల పొడవున్న ఓ సొరంగాన్ని సిద్ధం చేశారు అధికారులు. ప్రదక్షిణ చేసుకునే భక్తులు, ఆలయానికి వచ్చే వారి మధ్య రద్దీ తలెత్తకుండా ఆలయానికి తూర్పు భాగంలో నేల మట్టానికి దాదాపు 15 అడుగుల దిగువన 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించినట్లు చెప్పారు. ఈ సొరంగం గుండా ఒకేసారి 1.5 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణ చేయడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు. దేశంలో ఆలయ ప్రదక్షిణ కోసం నిర్మించిన అతి పెద్ద సొరంగం ఇదేనని అంటున్నారు. ప్రదక్షిణ కోసం 800 మీటర్ల పొడవైన గోడను నిర్మించే ప్రాజెక్టులోనే సొరంగం ఓ భాగమని వివరించారు. అక్టోబరు నాటికి సొరంగం పనులు కూడా 100 శాతం పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
'హజ్ యాత్రికుల వద్ద ఆ కార్డు ఉండాల్సిందే!'- మార్గదర్శకాలు జారీ