Ayodhya Open Surface Parking : అయోధ్య రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు శుభవార్త. ఐదు అంతస్తుల భవన సముదాయంలో భక్తుల సౌలభ్యం కోసం ఆధునిక ఓపెన్ సర్ఫేస్ పార్కింగ్ నిర్మించాలని ఉత్తర్ప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంఝా జంతారా సమీపంలోని 35 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ పార్కింగ్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ పార్కింగ్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC) మోడ్ కింద నిర్మితమవ్వనుంది. ఈ ప్రాజెక్టును ప్రజా పనుల శాఖకు చెందిన సీడీ-2 యూనిట్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ ఖర్చు అంచనా రూ.16,557 కోట్లు. అయోధ్యలో ఓపెన్ సర్ఫేస్ పార్కింగ్ నిర్మాణం వల్ల భక్తుల రద్దీని అరికట్టడం సులువు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ నిర్వహణ కూడా ఈజీ అవుతుందని యోచిస్తున్నారు.
యూపీ సర్కార్ ప్రకటనలో ఏముందంటే?
శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవం తర్వాత అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతిరోజూ లక్షలాది మంది రామయ్య దర్శనం కోసం వస్తున్నారు. దీంతో అయోధ్యలో పార్కింగ్, ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఈ ఓపెన్ సర్ఫేస్ పార్కింగ్ నిర్మాణం వల్ల అయోధ్యలో ట్రాఫిక్ తగ్గుతుంది. అలాగే భక్తులు తమ వాహనాలను సురక్షితంగా, క్రమపద్ధతిలో పార్క్ చేసుకోవచ్చు. ఈ పార్కింగ్ ప్రాజెక్ట్ స్థానిక వ్యాపారాన్ని కూడా పెంచుతుంది.
475 వావానాలకు నిలపొచ్చు!
ఈ పార్కింగ్ ఏరియాలో ఒకేసారి 475 వాహనాలను పార్క్ చేయవచ్చు. ఇందులో చిన్న, పెద్ద వాహనాలకు ప్రత్యేక ప్రాంతాలను కేటాయించనున్నారు. ఐదు అంతస్తుల భవనంలో పార్కింగ్ స్థలంతో పాటు రెండు వసతి గృహాలు, 13 దుకాణాలు ఉంటాయి. దుకాణాల్లో స్థానిక ఉత్పత్తులు, ప్రసాదం, ఇతర వస్తువులను విక్రయిస్తారు. ఈ ప్రాజెక్టును ఈపీసీ మోడ్ కింద సకాలంలో, నాణ్యమైన రీతిలో పూర్తి చేయనున్నారు.
"ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి ఈ యూనిట్ కట్టుబడి ఉంది. ఈ ప్రాజెక్టు స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. నిర్మాణ పనుల సమయంలో కార్మికులు, ఇంజినీర్లు, ఇతర సిబ్బంది అవసరం అవుతారు. పార్కింగ్ ప్రాంతంలో పచ్చని మొక్కలను నాటుతారు. అవి ఈ ప్రాంత అందాన్ని చెక్కుచెదరకుండా చేస్తాయి. పార్కింగ్ ఏరియాలో వాహనాలు, ప్రయాణీకుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేస్తాం" అని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సీడీ-2 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉమేశ్ చంద్ర తెలిపారు.
ఓపెన్ సర్ఫేస్ పార్కింగ్ అంటే ఏమిటి?
ఓపెన్ సర్ఫేస్ పార్కింగ్ అనేది ఓపెన్ గ్రౌండ్ లేదా ఉపరితలంపై నిర్మించిన పార్కింగ్ సౌకర్యం. ఇందులో బహుళ అంతస్తుల నిర్మాణాలకు బదులుగా వాహనాల పార్కింగ్ కోసం ఉపరితలంపై స్థలాన్ని కేటాయిస్తారు. ఈ రకమైన పార్కింగ్ సౌకర్యానికి కాస్త తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే నిర్మాణానికి తక్కువ సమయం పడుతుంది. బహిరంగ ప్రదేశం కాబట్టి నిర్వహణ, శుభ్రం చేయడం చాలా సులభం.
అయోధ్యలో భక్తుల కోసం 80 మీటర్ల టన్నెల్- దేశంలోనే మొదటిసారిగా!
అయోధ్య గర్భగుడి శిఖరంపై భారీ అడుగుల కలశం- శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు