Rahul Letter To Modi : దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల వారికి ఇచ్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్లలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. బలహీన వర్గాలకు చెందిన 90 శాతం మంది విద్యార్థులకు విద్యా అవకాశాలకు ఆటంకం కలిగించే ఈ రెండు కీలక సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాహుల్ లేఖ రాశారు.
'దయనీయంగా హాస్టళ్లలో పరిస్థితులు'
"ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల నివాస వసతి గృహాలలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ఇటీవల బిహార్ దర్భంగాలోని అంబేడ్కర్ హాస్టల్ను సందర్శించినప్పుడు ఆరేడుగురు విద్యార్థులు ఒకే రూమ్ను షేర్ చేసుకుంటున్నారు. అపరిశుభ్రమైన టాయిలెట్లు, అసురక్షిత తాగునీరు, మెస్ సౌకర్యాలు లేకపోవడం, లైబ్రరీలు, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం గురించి విద్యార్థులు నాకు ఫిర్యాదు చేశారు. అణగారిన వర్గాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్లు ఆలస్యం అవుతున్నాయి. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు" అంటూ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Lok Sabha LoP and Congress MP Rahul Gandhi writes a letter to Prime Minister Narendra Modi on improving hostel conditions and timely scholarships for students from marginalised communities. pic.twitter.com/t5yM72zNTF
— ANI (@ANI) June 11, 2025
"బిహార్లో స్కాలర్ షిప్ పోర్టల్ మూడేళ్లుగా పనిచేయట్లేదు. 2021-22లో ఏ విద్యార్థికి స్కాలర్ షిప్ రాలేదు. ఆ తర్వాత కూడా స్కాలర్ షిప్లు పొందుతున్న దళిత విద్యార్థుల సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 1.36 లక్షల మంది స్కాలర్ షిప్ను పొందగా, అది 2024 నాటికి 69 వేలకు చేరుకుంది. స్కాలర్ షిప్ చాలా తక్కువగా వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు. అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందకపోతే దేశం పురోగతి సాధించదని మీరు అంగీకరిస్తున్నారని అనుకుంటున్నాను. మీ సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తున్నాను" అని మోదీకి రాసిన లేఖలో రాహుల్ పేర్కొన్నారు.
'దేశవ్యాప్తంగా ఉన్న హాస్టల్స్లో ఇదే పరిస్థితి'
తాను బిహార్లోని వసతి గృహాల పరిస్థితిని ఉదాహరించినప్పటికీ, దేశవ్యాప్తంగా హాస్టల్స్లో ఇదే పరిస్థితులు ఉన్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వైఫల్యాలను పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే రెండు చర్యలు తీసుకోవాలని కోరుతున్నానన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల వసతి గృహాల్లో మంచి మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, ఆహారం, విద్యా సౌకర్యాలను నిర్ధరించడానికి ప్రతి హాస్టల్ ను ఆడిట్ చేయాలని పిలుపునిచ్చారు. వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించడానికి తగిన నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను సకాలంలో పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్కాలర్ షిప్ మొత్తాన్ని పెంచాలన్నారు.
'వారిని రాహుల్ నిరంతరం కలుస్తున్నారు'
ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ఎస్సీ విభాగం చీఫ్ రాజేంద్ర పాల్ గౌతమ్, ఆదివాసీ కాంగ్రెస్ చీఫ్ విక్రాంత్ భూరియా, ఏఐసీసీ ఎన్ఎస్ యూఐ ఇన్ ఛార్జ్ కన్హయ్య కుమార్ సంయుక్త విలేకరుల సమావేశంలో కూడా ఈ అంశాలను లేవనెత్తారు. అట్టడుగు వర్గాల విద్యార్థులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను రాహుల్ నిరంతరం కలుస్తున్నారని కన్హయ్య కుమార్ తెలిపారు.
"మేము బలహీన వర్గాల విద్యార్థులను కలిసినప్పుడల్లా వారు చెప్పే మొదటి విషయం ఏమిటంటే తమకు స్కాలర్ షిప్ సకాలంలో అందడం లేదని. దేశంలో స్కాలర్ షిప్ డ్రాప్ అవుట్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మొత్తం స్కాలర్ షిప్ ప్రక్రియను శిక్షగా మార్చింది. విద్యార్థుల స్కాలర్ షిప్, ఇతర సమస్యలు, హాస్టల్ పరిస్థితులపై రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి మోదీకి ఒక లేఖ రాశారు. అయితే దీనిపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో రాబోయే కాలంలో తెలుస్తుంది. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఒక పెద్ద సమస్యగా మారాయి. ప్రతి గంటకు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభుత్వం విద్యా బడ్జెట్ను నిరంతరం తగ్గిస్తోంది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ డబ్బును కూడా ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. దీని ఫలితంగా పిల్లలు విద్య వంటి ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇది అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా జరిగే పెద్ద అన్యాయం" అని కన్హయ్య కుమార్ వ్యాఖ్యానించారు.
ఇటీవలే లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దర్భంగాలోని డాక్టర్ అంబేడ్కర్ హాస్టల్ను సందర్శించారని కాంగ్రెస్ ఎస్సీ విభాగం చీఫ్ రాజేంద్ర పాల్ గౌతమ్ తెలిపారు. వివిధ హాస్టళ్ల నుంచి విద్యార్థులు వచ్చి రాహుల్ కలిశారనన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు చాలా దారుణమైన పరిస్థితుల్లో చదువుకోవాల్సి వస్తుందని విమర్శించారు. వారికి స్కాలర్ షిప్ లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రభుత్వ పోర్టల్ సర్వర్ డౌన్ అవుతుందని, కొన్నిసార్లు అది అస్సలు పనిచేయట్లేదన్నారు.
'ప్రస్తుతాన్ని వదిలేసిన మోదీ సర్కార్- 2047 గురించి కలలు కంటోంది'- రాహుల్ గాంధీ
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్- బిహార్లోనూ ఇదే రిపీట్: రాహుల్ గాంధీ