Dawoodi Bohra Community Thanks Modi : వక్ఫ్ (సవరణ) చట్టం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి దావూదీ బొహ్రా ముస్లింలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గురువారం బొహ్రా ముస్లిం ప్రతినిధులు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా, ప్రత్యేకంగా వక్ఫ్ సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తంచేశారు.
ఎవరీ బొహ్రాలు?
షియా ముస్లింలలో దావూదీ బొహ్రాలు ఒకరు. వీరు ముస్లింలలోనే జనాభాపరంగా మైనారిటీలుగా ఉన్నారు. ఆర్థికంగా వీరు చాలా బలమైన వర్గం. ఈ దావూదీ బొహ్రాలు వక్ఫ్ బిల్లుపై ఏర్పడిన పార్లమెంటరీ సంయుక్త కమిటీకి గతంలోనే తమ సిఫారసులను సమర్పించారు. వీటి ఆధారంగా చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది. అందుకే ఇప్పుడు వారు మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
అద్భుతంగా!
"దావూదీ బొహ్రా సమాజానికి చెందిన సభ్యులతో నేడు అద్భుతమైన సమావేశం జరిగింది. అనేక అంశాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నాం" అని 'ఎక్స్' వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Had a wonderful meeting with members of the Dawoodi Bohra community! We talked about a wide range of issues during the interaction.@Dawoodi_Bohras pic.twitter.com/OC09EgcJPG
— Narendra Modi (@narendramodi) April 17, 2025
అమల్లోకి వచ్చిన వక్ఫ్ యాక్ట్
పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ అవ్వగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా మారింది.
వక్ఫ్ యాక్ట్కు వ్యతిరేకంగా పిటిషన్లు!
అయితే వక్ఫ్ సవరణ చట్టం -2025 రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇలా పిటిషన్లు వేసిన వారిలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావెద్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ తదితరులు ఉన్నారు. వైసీ తరఫున అడ్వకేట్ లాజఫీర్ అహ్మద్ పిటిషన్ను దాఖలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టం -2025ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేకుండా ఆపాలంటూ జమియత్ ఉలమాయె హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదనీ మధ్యంతర పిటిషన్ కూడా వేశారు. సున్నీ మతపెద్దల సంస్థ సమస్త కేరళ జమియతుల్ ఉలెమా కూడా పిటిషన్ వేసింది. ఈ సంస్థ తరఫున పిటిషన్ను అడ్వకేట్ జుల్ఫికార్ అలీ పీఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అసోసియేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా పిటిషన్ వేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 21, 25, 26, 29, 30, 300-Aలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం -2025 ఉందని పిటిషన్లలో వాదించారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్ట్ తదుపరి విచారణను వచ్చేనెల 5కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ పరిస్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది.
వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను నియమించొద్దు: సుప్రీంకోర్టు
'సుప్రీంకోర్ట్ రాష్ట్రపతిని ఆదేశించగలదా?- జడ్జీలు సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారా?'