Air India Plane Engine Overhauled : గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద కారణాలను తెలుసుకునే దిశగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. దీనిపై ప్రస్తుతం ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)తో పాటు నిపుణులతో కూడిన హైలెవల్ కమిటీ విచారణ జరుపుతున్నాయి. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా 171 విమానానికి సంబంధించిన అన్ని రకాల సాంకేతిక సమాచారాన్ని కూడగట్టి, ప్రమాద కారణాలను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. ఈక్రమంలోనే ఆ విమానం నిర్వహణ, ఇంజిన్ల పనితీరుతో ముడిపడిన కీలక వివరాలను అధికార వర్గాలు వెల్లడించాయి. వాటిపై ఓ లుక్ వేద్దాం.
అది 12 ఏళ్ల పాత విమానం- ఇతర వివరాలివీ
- అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం 'బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్' రకానికి చెందింది.
- ఇది జూన్ 12న (గురువారం) మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయింది.
- ఈ విమానానికి చివరిసారిగా 2023 జూన్లో సమగ్ర నిర్వహణపరమైన తనిఖీలు(సీ- చెక్స్) జరిగాయి. తదుపరి సీ- చెక్స్ ఈ ఏడాది డిసెంబరులో జరగాల్సి ఉంది.
- విమానాల సమగ్ర నిర్వహణపరమైన తనిఖీలను సంక్షిప్తంగా సీ-చెక్స్ అని పిలుస్తుంటారు.
- ఈ విమానం సీ-చెక్స్ను ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (AIESL) నిర్వహించింది.
- ఈ ఫ్లైట్ దాదాపు 12 ఏళ్లు పాతది.
- ఈ విమానంలోని కుడి భాగంలో ఉండే ఇంజిన్ను పూర్తిస్థాయిలో రిపేరింగ్ ద్వారా పునరుద్ధరించారు. దాన్ని 2025 మార్చిలోనే విమానంలో ఇన్స్టాల్ చేశారు.
- విమానంలోని ఎడమ భాగంలో ఉండే ఇంజిన్ను దాని తయారీ సంస్థ నిబంధనల ప్రకారం 2025 ఏప్రిల్లోనే తనిఖీ చేయించారు.
- ప్రమాదానికి గురైన విమానంలో అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ కంపెనీ తయారు చేసే జెనెక్స్ ఇంజిన్లు (GEnx engines) ఉండేవి.
- విమానంలోని ఇంజిన్ల పనితీరులో ఎన్నడూ ఎలాంటి సమస్యలూ రాలేదని అధికార వర్గాలు తెలిపాయి.
- ఈ అంశంపై ఎయిర్ ఇండియా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ కాలేదు.
డీజీసీఏ ఆదేశాలు- ఎయిర్ ఇండియా స్పందన
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన నేపథ్యంలో భారత విమానయాన రంగ పర్యవేక్షక సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 - 8/9 రకం విమానాలకు అత్యున్నత ప్రమాణాల ప్రకారం భద్రతా తనిఖీలు చేయించాలని శుక్రవారం ఆదేశించింది. దీనిపై శనివారం రోజు ఎయిర్ ఇండియా స్పందిస్తూ, "అన్ని విమానాలకు వన్ టైం భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 9 విమానాలకు తనిఖీలు పూర్తయ్యాయి" అని వెల్లడించింది. ఎయిర్ ఇండియా వద్ద బోయింగ్ 787 - 8ఎస్ రకానికి చెందిన 26 విమానాలు, బోయింగ్ 787 - 9ఎస్ రకానికి చెందిన 7 విమానాలు ఉన్నాయి.
ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడంలో సహకరిస్తాం : జీఈ ఏరోస్పేస్
"ఎయిర్ ఇండియా 787 - 8/9 రకాలకు చెందిన విమానాల భద్రతా తనిఖీల విషయంలో డీజీసీఏ తీసుకునే చర్యలకు మేం కట్టుబడి ఉంటాం. వాటికి తగిన సహకారాన్ని అందిస్తాం. దర్యాప్తు సంస్థలు, నియంత్రణ సంస్థలతో కలిసి పనిచేస్తాం. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు గల కారణాలను తెలుసుకునే దిశగా జరిగే దర్యాప్తునకు మేం అన్ని రకాల సాంకేతిక సమాచారాన్ని సమకూరుస్తాం" అని జీఈ ఏరోస్పేస్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతులు- దర్యాప్తునకు హైలెవెల్ కమిటీ
ఎయిర్ ఇండియా 'బోయింగ్ 787' విమానాల తనిఖీని మరింత పెంచాల్సిందే - DGCA ఆదేశం