Centre High Level Security Meeting : పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఉన్నతస్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మూడు పారామిలిటరీ దళాల అధిపతులతో పాటు మరో రెండు భద్రతా సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ఏ అంశంపై చర్చించారనే దానిపై స్పష్టత లేదు.
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్- బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ బ్రిఘు శ్రీనివాసన్, అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్- లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా ఈ సమావేశానికి హాజరైనట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. సశస్త్ర సీమా బల్-ఎస్ఎస్బీ అదనపు డైరెక్టర్ జనరల్ అనుపమ నీలేకర్ చంద్ర కూడా ఈ మీటింగ్లో పాల్గొన్న వారిలో ఉన్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్తో భారతదేశ అంతర్జాతీయ సరిహద్దులను బీఎస్ఎఫ్ కాపలా కాస్తుంది. నేపాల్, బంగ్లాదేశ్తో సరిహద్దులను ఎస్ఎస్బీ పహారా కాస్తుంది. అసోం రైఫిల్స్ మయన్మార్తో సరిహద్దును రక్షిస్తుంది. ఎన్ఎస్జీ అనేది ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు చేసే ప్రత్యేక కమాండో దళం.
అందుకేనా?
ఇదిలా ఉండగా, తాజాగా పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ అసీఫ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదే విషయాన్ని పాక్ ప్రభుత్వానికి ఆర్మీ నివేదించినట్టు మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. భారత్ దాడి చేసే అవకాశం ఉన్నందున సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ, కీలకమైన భద్రతా సంస్థలతో భేటీ అవడం గమనార్హం.
ఏప్రిల్ 22 జమ్ముకశ్మీర్లోని ప్రముఖ పర్యటక ప్రదేశం పహల్గాంలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ పాశవిక దాడిలో 26మంది టూరిస్టులు చనిపోయారు. దీంతో భద్రతా వ్యవహారాల కమిటీ-సీసీఎస్ పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో స్పందించింది. పాక్పై పలు ఆంక్షలు వేసింది. 1960లో ఏర్పాటైన సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షిణమే నిలిపివేలాని నిర్ణయించింది. అంతేకాకుండా, దీర్ఘకాలిక వీసా, దౌత్య, అధికారిక వీసా ఉన్నవారు మినహా పాకిస్థానీయులందరూఏప్రిల్ 29 నాటికి భారత్ విడిచి వెళ్లాలని కేబినెట్ కమిటీ నిర్ణయించింది. దౌత్యపరమైన చర్యలతో పాటు మిలిటిరీ పరంగా కూడా పాకిస్థాన్కు బుద్ధి చెప్పాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జమ్ముకశ్మీర్లో 48పర్యటక ప్రాంతాల మూసివేత- ఉగ్రదాడులు జరగొచ్చని వార్నింగ్
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే- ప్రపంచం కళ్లు మూసుకుని కూర్చోదు: యూఎన్లో భారత ప్రతినిధి