Delhi HC On Cash Recovery Row : దిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ నివాసంలో నోట్లకట్టలు దొరికాయన్న ఆరోపణలు వేళ ఆయనను విధులు నుంచి దూరంగా ఉంచాలని దిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జస్టిస్ యశ్వంత్ వర్మకు విధులకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ దిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.
'న్యాయవ్యవస్థపైనే నమ్మకం పోతుంది'
మరోవైపు ఈ వ్యవహారంలో న్యాయపరమైన దర్యాప్తు జరగాలని, ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. 'దేశ చరిత్రలో ఒక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం ఇదే తొలిసారని' ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఈ ఘటనతో ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం దెబ్బతింటుందని పేర్కొన్నారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని, పార్లమెంట్లో కూడా ఈ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేశారు.
'గతంలో ఓ న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసి మరుసటి రోజే రాజకీయ పార్టీలో చేరడం, ఓ సీజేఐ పదవీ విరమణ చేసి పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడం, ఇప్పుడు మరో న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం ఇలాంటి ఘటనలు న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయని' తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అభిశంసించాలని సీపీఐ ఎంపీ పి.సందోశ్ కుమార్ డిమాండ్ చేశారు.
వీడియోలో- కాలిన నోట్ల కట్టలు!
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియోను పోలీస్ కమిషనర్ దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయకు అందించారు. ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఇచ్చారు. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫొటోలు, వీడియోలతో సహా సుప్రీం కోర్టు తన వెబ్సైట్లో పెట్టింది. వెబ్సైట్లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారమే ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ విచారణ సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ కమిటీకి నిర్ణీత గడువేమీ విధించలేదు.