Operation Sindhu Updates : ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్లో చిక్కుకున్న 290 మంది భారతీయులను 'ఆపరేషన్ సింధు'లో భాగంగా ప్రత్యేక విమానం ద్వారా రాత్రి దిల్లీకి తీసుకొచ్చారు. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సింధు' కోసం ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తేసింది. దాదాపు 1,000 మంది భారతీయులను తరలించడానికి మూడు విమానాల కోసం ప్రత్యేకంగా ఆ దేశం తన గగనతలాన్ని తెరిచింది. ఆ మూడు విమానాల్లో తొలి ఫ్లైట్ తాజాగా దిల్లీకి చేరుకుంది.
మరో రెండు విమానాల్లో ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులు ఇండియాకు తిరిగి రానున్నారు. విమానం ల్యాండ్ అయ్యే సరికి 'భారత్ మాతా కీ జై', 'హిందూస్తాన్ జిందాబాద్' నినాదాలతో విమానాశ్రయం మారుమోగింది. ఇరాన్ నుంచి వచ్చిన వారిలో విద్యార్థులు, ధార్మిక యాత్రికులు, పర్యాటకులు ఉన్నారు. క్లిష్ట సమయంలో తమను రక్షించిన భారత భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఆపరేషన్ సింధు అద్భుతం!
- "అక్కడ యుద్ధ పరిస్థితి ఉంది. ఎలా బయటపడతామో అని అస్సలు అర్థం కాలేదు. కానీ భారత ప్రభుత్వం చాలా సమర్థంగా మమ్మల్ని తీసుకొచ్చింది. చాలా ధన్యవాదాలు" అని నోయిడా వాసి తజ్కియా ఫాతిమా అన్నారు.
- "ఇప్పుడు నేను ఫీలవుతున్న భావాన్ని మాటల్లో చెప్పలేను. ఇరాన్లో మమ్మల్ని 5 స్టార్ హోటల్స్లో ఉంచారు. భద్రత కల్పించారు. కానీ ఇప్పుడు ఇండియాకు వచ్చాక మనఃశ్శాంతి లభించింది. భారత ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఎంబసీ అన్నీ సౌకర్యాలను కల్పించింది" అని ఇలియా బతూల్ చెప్పారు.
- "మేమంతా సురక్షితంగా తిరిగివచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇరాన్లో పరిస్థితులు ఏం బాగోలేవు. భారత ఎంబసీ, రాయబారి మమ్మల్ని బాగా చుసుకున్నారు" అని మౌలానా మొహమ్మద్ సయీద్ చెప్పారు.
- "ఇరాన్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మొదట్లో పరిస్థితి అంత తీవ్రంగా అవుతుందని అనుకోలేదు. ఇండియన్ ఎంబసీ ఇంత కష్టపడి మమ్మల్ని తీసుకెళ్తుందని నమ్మలేకపోయాను. అందరూ, ముఖ్యంగా కశ్మీర్ విద్యార్థులు భారత ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నారు" అని టెహ్రాన్లోని ఇరాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థిని సెహ్రిష్ రఫీక్ పేర్కొన్నారు.
- "ఆపరేషన్ సింధు అద్భుతంగా ఉంది. మేము టెహ్రాన్లో చిక్కుకుపోయాం. ఇంటి యజమానులు కూడా వెళ్లిపోయారు. మాకు దారి తెలియదు. ఎంబసీ మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చింది. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు" అని జమ్ము కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన మిర్ మహ్మద్ ముషార్రఫ్ అన్నారు.
భారత్-ఇరాన్ మధ్య బంధం!
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీపీవీ, ఓఐఏ కార్యదర్శి అరుణ్ కుమార్ చటర్జీ మాట్లాడుతూ, ఇరాన్ నుంచి 290 మంది వచ్చారని తెలిపారు. 'వారిలో 190 మంది జమ్మూకశ్మీర్కు చెందినవారు. మిగతా వారు దిల్లీ, హరియాణా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాలవారు. ఈ ఆపరేషన్ భారత్-ఇరాన్ మధ్య ఉన్న బంధాన్ని ప్రతిబింబిస్తుంది' అని ఆయన తెలిపారు.
ఇదే విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'ఆపరేషన్ సింధు కింద 290 మంది భారతీయులను ఇరాన్ నుంచి తీసుకొచ్చాం. వీరిలో విద్యార్థులు, ధార్మిక యాత్రికులు ఉన్నారు. ఇరాన్ ప్రభుత్వానికి భారత తరఫున ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.
పాకిస్థాన్కు 40 చైనా J-35 జెట్లు- వాటి కోసం భారత్ మరో పదేళ్లు ఆగాల్సిందే!