Assam MLA Arrest : కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్పై యావత్ భారత్ మండిపడుతోంది. కేంద్రం సైతం పాక్పై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో పాకిస్థాన్ను వెనకేసుకొచ్చారనే ఆరోపణలపై అస్సాం ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. దేశద్రోహం అభియోగాల కింద ఆయనను అరెస్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.
పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో పాకిస్థాన్ను, ఆ దేశ ప్రమేయాన్ని ఎమ్మెల్యే అమీనుల్ సమర్థిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అందుకే ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాను. ఆయనను అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు అని మీడియా సమావేశంలో సీఎం హిమంత చెప్పారు.
సోషల్ మీడియా సహా ఏ విధంగానైనా పాకిస్థాన్కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇచ్చే చర్యలను సహించేది లేదని తేల్చి చెప్పారు. అటువంటివారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
మాకు సంబంధం లేదు
అయితే ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం ప్రకటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఏఐయూడీఎఫ్ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ తమ పార్టీ ప్రభుత్వం వెన్నంటే ఉంటామని తెలిపింది. ఇదిలా ఉండగా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్పై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.