ALL PARTY MEETING ON TERROR ATTACK : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్ భవనంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం అఖిలపక్ష సమావేశం భేటీ జరిగింది. ఉగ్రవాదంపై కఠిన చర్యలు ఉంటాయని అఖిలపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడిపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
'జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం, టూరిజం వృద్ధి చెందుతున్న సమయంలో స్థానిక పరిస్థితులను ప్రభావితం చేసే లక్ష్యంతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన తర్వాత తీసుకున్న చర్యలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారు. ఉగ్రదాడికి దారితీసిన లోపాలు, అవి పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ అధికారులు వివరించారు. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం వెన్నంటే ఉన్నట్లు అన్ని పార్టీల నేతలు చెప్పారు' అని కిరణ్ రిజిజు తెలిపారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ చీప్, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి జైశంకర్, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలతోపాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు పాల్గొన్నారు.
ఈ భేటీ ప్రారంభమయ్యే ముందు ఉగ్రదాడిలో అమరులైన వారికి నేతలందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడి ఘటన, తదనంతరం తీసుకున్న చర్యల్ని కేంద్రం వివరించింది. ఉగ్రదాడుల్ని ఎదుర్కోవడంలో ఆయా పార్టీల సలహాలను కోరే అవకాశం ఉంది. ఉగ్రదాడి ఘటనపై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ భేటీని ఏర్పాటు చేసింది.