Akshaya Tritiya 2025 Ayodhya : హిందువుల పవిత్ర పండగైన అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) కోసం అయోధ్య రామాలయం ముస్తాబు అవుతోంది. ఈ పవిత్రదినాన రామమందిరం సహా అయోధ్యలోని 5000 దేవాలయాలలో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రామ్లల్లాకు 56 రకాల వంటకాలు, సీజనల్ పండ్లను సమర్పించనున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా అయోధ్య రామాలయానికి భక్తులు పోటెత్తె అవకాశం ఉండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏమిటి? హిందూ మతంలో వైశాఖ మాసం విష్ణువుకు ఇష్టమైన నెలగా పరిగణిస్తారు. అక్షయ తృతీయనాడు బంగారం, వెండి కొనడం, దానధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ తిథిని యుగాది అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి మరో అవతారమైన పరశురాముడు అక్షయ తృతీయ నాడే జన్మించాడని నమ్ముతారు. అదే సమయంలో రైతులు తమ పొలాలను దున్నడం, విత్తడం నాటడం వంటి పనులను ప్రారంభిస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం అక్షయ తృతీయనాడు ఏ పని ప్రారంభించినా అది పూర్తవుతుందని భక్తుల నమ్మకం. అందుకే దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయం అందంగా ముస్తాబు అవుతోంది.
అందంగా ముస్తాభైన రామాలయం
అయోధ్యలోని అన్ని దేవాలయాలలో శ్రీరాముడిని మహావిష్ణువు 11వ అవతారంగా పూజిస్తారు. అక్షయ తృతీయనాడు దేవాలయాల గర్భగుడిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఉదయాన్నే విగ్రహామూర్తులకు అభిషేకం చేసి, కాటన్ వస్త్రాలతో ముస్తాబు చేస్తారు. ఆ తర్వాత హారతి ఇస్తారు. మధ్యాహ్నం సీజనల్ పండ్లను, వివిధ రకాల వంటకాలను శ్రీరాముడికి సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రసాదాన్ని భక్తులను పంచుతారు.
గతేడాది అక్షయ తృతీయ సందర్భంగా అయోధ్య రామయ్యకు 1,100 మామిడి పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ ను ప్రత్యేక నైవేద్యంగా పెట్టారు. ఈసారి కూడా అలాగే రామ్ లల్లాకు అదే విధమైన ప్రసాదాన్ని సమర్పించేందుకు సిద్ధవువుతున్నారు. అక్షయ తృతీయ నాడు సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు.
రామ్ లల్లాను దర్శించుకోనున్న హనుమాన్ గడీ ప్రధాన అర్చకుడు
అయోధ్యలోని హనుమాన్గఢీ దేవాలయం ప్రధాన అర్చకుడు మహంత్ ప్రేమ్ దాస్ 70 ఏళ్లలో తొలిసారిగా ఆలయ ప్రాంగణం నుంచి బయటకు అడుగుపెట్టనున్నారు. అక్షయ తృతీయనాడు ఆయన హనుమాన్ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న రామాలయానికి వెళ్లి బాలరాముడిని దర్శించుకోనున్నారు.
అయోధ్యలో భక్తుల కోసం 80 మీటర్ల టన్నెల్- దేశంలోనే మొదటిసారిగా!
భక్తులకు గుడ్న్యూస్- అయోధ్యలో 35ఎకరాల ఓపెన్ పార్కింగ్- ఇకపై ఎవరికీ నో ప్రాబ్లమ్!