COVID Cases In India : దేశంలో మళ్లీ కొవిడ్-19 కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కరోనా కారణంగా శనివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
కొవిడ్-19తో మహారాష్ట్రలోని ఠాణెలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు శనివారం ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరికీ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. ఠాణెలో శనివారం కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 18 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు చెప్పారు. వీరిలో 17 మంది తమ హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని, ఒకరు మాత్రమే ఆస్పత్రిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నోయిడాకు చెందిన 55 ఏళ్ల మహిళకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో కొత్తగా రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఉత్తరాఖండ్లోనూ కరోనా కేసులు రెండు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చార్ధామ్ యాత్ర సందర్భంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇక మే నెలలో ఇప్పటివరకు ఒక్క కేరళలో అత్యధికంగా 273 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. అటు దిల్లీలో 23 మందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్లో నాలుగు కేసులు, తెలంగాణలో 1 కేసు నమోదయ్యాయి. అయితే, క్రియాశీలకంగా ఉన్న కేసుల్లో రోగుల పరిస్థితి సాధారణంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అందరూ ఇంటి దగ్గరే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సమీక్షించారు. చాలా కేసుల్లో తీవ్రత అంతగా లేదని అధికారులు చెబుతున్నారు.
కొత్తగా నమోదు అవుతున్న కేసుల్లో ఎన్బీ.1.8.1, ఎల్ఎఫ్.7 అనే రెండు కొత్త కొవిడ్ సబ్ వేరియంట్లను భారత్లో గుర్తించామని ఇండియన్ సార్స్ కరోనా వైరస్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. ఎన్బీ.1.8.1 కొవిడ్ సబ్ వేరియంట్కు చెందిన ఒక కేసు ఏప్రిల్లో తమిళనాడులో బయటపడగా, ఎల్ఎఫ్.7 కొవిడ్ సబ్ వేరియంట్కు చెందిన నాలుగు కేసులు మేలో గుజరాత్లో నమోదైనట్లు ఇన్సాకాగ్ తెలిపింది. చైనా సహా ఆసియాలోని పలుదేశాల్లో కరోనా కేసులు పెరగడానికి ఈ సబ్ వేరియంట్లే కారణమవుతున్నాయని పేర్కొంది. ఈ సబ్ వేరియంట్ల వల్ల దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషిస్తున్నామని వెల్లడించింది.