తెలంగాణ

telangana

డిజిటల్‌ మాధ్యమంలో తెలుగువెలుగులు

By

Published : Mar 28, 2021, 7:20 AM IST

telugu writers, digital media

అమ్మభాషను డిజిటల్‌ మాధ్యమంలో పరిపుష్టం చేసే మహత్తర క్రతువును ఔత్సాహిక రచయితలు భుజానికెత్తుకున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర.. మన ఊరు.. మన చుట్టూ ఉన్న గొప్ప వ్యక్తులను భావితరాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా వ్యాసరచనలో నిమగ్నమయ్యారు. తెలుగు వికీపీడియాను బలోపేతం చేసేలా వేలాదిగా ప్రత్యేక పేజీలు రచిస్తున్నారు.

డిజిటల్‌ వేదికల్లో అమ్మభాషలో సమాచారాన్ని నిక్షిప్తం చేసే తెలుగు వికీపీడియన్లు పెరుగుతున్నారు. తెలుగు వికీపీడియాలో వ్యాసరచనను గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వ్యాసాల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు 10 వేల వ్యాసాలతో శాండ్‌బాక్సును తయారు చేసింది. రచయితల కోసం ప్రత్యేకంగా ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

‘డిజిటల్‌ మాధ్యమంలో తెలుగు రాయడం, సాంకేతికతను నేర్పడం ద్వారా ప్రత్యేకంగా ఉద్యోగాలు సాధించేందుకు ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు తీసుకువచ్చాం. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు కృత్రిమమేధను ఉపయోగించి తెలుగులో రాయడంపై వేసవిలో ఇంటర్న్‌షిప్‌ ఇవ్వనునున్నాం. ఇలా 50 మంది విద్యార్థులను తీసుకుంటున్నాం’: ప్రొ.వాసుదేవవర్మ, ట్రిపుల్‌ ఐటీ ప్రాజెక్టు ముఖ్య పరిశోధకులు.

రోజుకో వ్యాసం అలవాటుగా...

ఈయన పేరువంగరి ప్రణయ్‌రాజ్‌. ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. తెలుగు విశ్వవిద్యాలయంలో నాటకరంగంపై పీహెచ్‌డీ చేసే సమయంలో దానికి సంబంధించిన అంశాలు ఇంటర్నెట్‌లో వెతికితే తగిన సమాచారం దొరికేది కాదు. అనంతరం భారతీయ భాషల్లో వికీపీడియా అభివృద్ధిపై కృషి చేస్తున్న విష్ణువర్ధన్‌ సూచన మేరకు 2013 మార్చి 8న ‘వికీ’లో తెలుగు వ్యాసరచనకు శ్రీకారం చుట్టారు. 2016 సెప్టెంబరు 8 నుంచి రోజూ ఒక వ్యాసం రాయడం అలవాటుగా పెట్టుకున్నారు.

చిత్రాల అప్‌లోడ్‌లో ప్రపంచరికార్డు

వరంగల్‌ జిల్లా జనగాంకు చెందిన ఈయన పేరు ఆదిత్య పకిడే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. 2017లో మన ముచ్చట్లు పేరిట బ్లాగు రాసేవారు. వికీపీడియాలో ‘వంద రోజులు.. వంద చిత్రాలు’ ఛాలెంజ్‌ తీసుకుని ఫొటోలు అప్‌లోడ్‌ చేశారు. దాన్ని 365 రోజులపాటు కొనసాగించడంతో వికీపీడియా నుంచి ప్రపంచరికార్డు అంటూ ప్రశంస వచ్చింది. ‘2017 అక్టోబరు 30న ప్రారంభమైన నా ప్రయాణం నేటికీ కొనసాగుతోంది. అప్పుడప్పుడు వ్యాసాలు కూడా రాస్తున్నా. చిత్రాన్ని స్వయంగా నేనే తీసి, కాపీరైట్‌ వదులుకుని అందులో అప్‌లోడ్‌ చేస్తున్నా’ అని తెలిపారు ఆదిత్య.

వంద రోజులు.. వంద వ్యాసాలు

క్వారాలో కమ్యూనిటీ మేనేజర్‌గా పనిచేస్తున్న పవన్‌సంతోష్‌ది ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. ఎం.ఫార్మసీ పూర్తయ్యాక వికీపీడియన్‌ రెహ్మానుద్దీన్‌ సూచన మేరకు వ్యాసాలు రాయడం ప్రారంభించారు. విద్యాభ్యాసం ఆంగ్లమాధ్యమంలో అయినా, తెలుగు సాహిత్యంపై మక్కువతో ఎక్కువగా చదివేవారు. బీ ఫార్మసీలో ఉన్నప్పుడే మాతృభాషలో బ్లాగులు రాసేవారు. ప్రస్తుతం ఈయన వద్ద 800 పుస్తకాల లైబ్రరీ ఉంది. ‘వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్న క్రమంలో బల్గేరియన్‌ వికీపీడియన్‌ ఒకరు ‘వంద రోజులు.. వంద వ్యాసాలు’ ఛాలెంజ్‌ తీసుకువచ్చారు. తెలుగులో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. 2015లో తెలుగు వికీపీడియా తరఫున కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పురస్కారం దక్కింది. ఇప్పటికీ వ్యాసరచన కొనసాగిస్తున్నా’ అంటున్నారు పవన్‌.

70 ఏళ్ల వయసులో సమాచార సేవ

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు చెందిన యర్రా రామారావు వయసు 70 ఏళ్లు. పంచాయతీరాజ్‌ శాఖలో ఈవోపీఆర్డీగా పనిచేసి 2009లో ఉద్యోగ విరమణ చేశారు. తమ గ్రామం గురించి ఒకసారి గూగుల్‌లో వెతికితే పెద్దగా సమాచారం లేదు. ఏదో వెలితిగా అనిపించింది. 2017లో గ్రామంలోని ఆలయాల చరిత్రపై పుస్తకం రాశారు. ఆ సమాచారమంతా వికీపీడియాలో పెట్టారు. అప్పటి నుంచీ వ్యాసాలు రాయడం అలవాటుగా మారింది. అనంతరం వికీపీడియాలో గ్రామాల వివరాలు పొందుపరిచే ప్రాజెక్టు చేపట్టారు. ‘గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని గ్రామాల వివరాలు పొందుపరిచాను. తెలంగాణలోని పది జిల్లాలు 33 జిల్లాలుగా మార్చిన తర్వాత పునర్వ్యవస్థీకరణ పనులు చేసి 9 వేల రెవెన్యూ గ్రామాల సమాచారాన్ని వికీపీడియాలో అప్‌లోడ్‌ చేశా. ఇప్పటివరకు 600కు పైగా వ్యాసాలు రాశాను. మున్ముందు కూడా వ్యాసాలు రాస్తూనే ఉంటాను’ అని వివరించారు రామారావు.

ఇదీ చదవండి :నిలకడగా రాష్ట్రపతి ఆరోగ్యం-30న శస్త్రచికిత్స

ABOUT THE AUTHOR

...view details