ETV Bharat / state

అక్రమ నిర్మాణదారులతో జీహెచ్ఎంసీ అధికారులు కుమ్మక్కైనట్లుగా ఉంది: హైకోర్టు

author img

By

Published : Jan 14, 2023, 12:12 PM IST

అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీని హైకోర్టు తప్పుబట్టింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత నోటీసులపై సివిల్‌ కోర్టు యధాతథస్థితి ఉత్తర్వులంటే.. తదుపరి నిర్మాణాలను కొనసాగించుకోవాలని చేతులెత్తేయడం కాదని పేర్కొంది. ఇలాంటి నిర్మాణాలను కొనసాగకుండా చూడాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీపై ఉందని న్యాయస్థానం వెల్లడించింది.

Telangana High Court
Telangana High Court

అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీని హైకోర్టు తప్పుబట్టింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత నోటీసులపై సివిల్‌ కోర్టు యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేసిందంటే.. అధికారులు చేతులెత్తేయాలని కాదని.. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీపై ఉందని స్పష్టం చేసింది. యధాతథస్థితి ఉత్తర్వులున్నందున నిర్మాణాల్లో జోక్యం చేసుకోలేదన్న జీహెచ్ఎంసీ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది.

దీన్ని చూస్తే అక్రమ నిర్మాణదారులతో జీహెచ్ఎంసీ అధికారులు కుమ్మక్కైనట్లుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. యధాతథస్థితి ఉత్తర్వులంటే తదుపరి నిర్మాణాలను కొనసాగించుకోవాలని చేతులెత్తేయడం కాదని.. నిర్మాణాలను కొనసాగకుండా చూడాలని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం రాధాకృష్ణనగర్‌, అత్తాపూర్‌లో అనీస్‌ ఫాతిమా, మహమ్మద్‌ ఆయాజ్‌ మన్సూర్‌లు మూడంతస్తుల అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటూ 2018లో ఇచ్చిన వినతి పత్రంపై చర్య తీసుకోకపోవడాన్ని సవాలుచేస్తూ సిద్ధాపురం రాజారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు.

వినతి పత్రం ఆధారంగా అదే ఏడాది జారీ చేసిన నోటీసును పట్టించుకోకపోవడంపై మరో పిటిషన్‌ దాఖలుచేశారు. వీటిపై సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టగా.. ప్రతివాదులు సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించి యథాతథస్థితి ఉత్తర్వులు పొండంతో జోక్యం చేసుకోలేదని జీహెచ్‌ఎంసీ చెప్పింది. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాన్ని ఈ కోర్టుకు తీసుకువచ్చి చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారంటూ పిటిషన్లను సింగిల్‌ జడ్జి కొట్టివేశారు. రాజారెడ్డి అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీల ధర్మాసనం విచారణ చేపట్టింది. యథాతథస్థితి ఉత్తర్వులు కొనసాగించేలా చూడాలని అధికారులను ఆదేశించింది.

పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు: మరోవైపు రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, పురపాలక పట్టణాల్లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. టీఎస్‌బీపాస్‌ చట్టంలో భాగంగా ఏర్పాటైన టాస్క్‌ఫోర్సు కమిటీలు అలంకారప్రాయంగా మారాయి. నిబంధనలకు అనుగుణంగా భవన నిర్మాణాలు జరిగేలా చూడటంతోపాటు అతిక్రమణలకు పాల్పడిన భవనాలను కూల్చివేయడం, జరిమానాలు విధించడం వంటి కీలక బాధ్యతల్ని నిర్వర్తించాల్సిన ఈ కమిటీలు హెచ్‌ఎండీఏ, మరో ఒకట్రెండు చోట్ల మినహా క్రీయాశీలంగా లేవనే విమర్శలున్నాయి.

టీఎస్‌బీపాస్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్సు కమిటీలు ఏర్పాటైనా.. నిర్మాణం పూర్తయ్యేలోపు కనీసం ఒకసారి కూడా భవనాన్ని పరిశీలించే స్థితిలో అవి లేవు. వివిధ శాఖల అధికారులతో ఉన్న ఈ బృందాలు అత్యధిక చోట్ల బాధ్యతలకు దూరంగా ఉంటున్నాయి. దీనికితోడు రాజకీయ ఒత్తిళ్లతో అక్రమ నిర్మాణాలు, అతిక్రమణలపై దృష్టిసారించాలంటేనే కొన్ని చోట్ల బెంబేలెత్తుతున్నారు. దీంతో ఎలాంటి సెట్‌బ్యాక్‌లు లేకుండానే నిర్మాణాలు చేయడం, మాస్టర్‌ప్లాన్‌ నిబంధనల ఉల్లంఘనలు షరా మామూలు వ్యవహారంగా తయారయ్యాయి.

ఇవీ చదవండి: జీహెచ్​ఎంసీ రూ.1935 కోట్లతో రెండో దశ ప్రణాళిక.. తప్పనున్న ట్రాఫిక్​ పాట్లు

శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు.. సంక్రాంతి రోజు విగ్రహ ప్రతిష్ఠాపన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.