ETV Bharat / state

వరద ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

author img

By

Published : Nov 3, 2020, 5:06 AM IST

Updated : Nov 3, 2020, 6:17 AM IST

హైదరాబాద్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని జీహెచ్​ఎంసీ చేపట్టింది. వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టిన యంత్రాంగం... చెరువుల్లో పేరుకున్న గుర్రపుడెక్క, వ్యర్థాలు తొలగిస్తోంది. దోమల సంతతి వృద్ధిచెందకుండా యాంటీ లార్వా స్ప్రేయింగ్‌, ఫాగింగ్‌ పనులు చేపడుతున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వెల్లడించారు. నగరంలోని చెరువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.

వరద ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం
వరద ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

వరద ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

ఇటీవల వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలపై జీహెచ్​ఎంసీ దృష్టిసారించింది. ఈ మేరకు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు యాంటీ లార్వా స్ప్రేయింగ్‌, ఫాగింగ్‌ చేపట్టారు. చెరువులను బాగుచేసేందుకు నగరంలోని 39 చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగిస్తున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వివరించారు. పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 185 చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్‌ వెల్లడించారు. చెరువు పరిసరాల్లో సోడియం హైపో క్లోరైట్ క్రిమిసంహారకాలను పిచికారి చేస్తున్నారు.

125 బృందాలు...

గ్రేటర్‌వ్యాప్తంగా 125 బృందాలు నీటి నిల్వ ప్రాంతాలు, నాలాల్లో యాంటీ మలేరియా స్ప్రేయింగ్ చేస్తున్నారు. వరదనీటిని తొలగించిన 252 ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా క్రిమి సంహారకాలు పిచికారీ చేస్తున్నారు. 2 లక్షల గంబూషియా చేపపిల్లలు, 6 వేల ఆయిల్ బాల్స్​ను నాలాలు, కాలువలు, చెరువుల్లో వదిలారు. వారంలో అన్ని చెరువుల్లోనూ స్ప్రేయింగ్ పూర్తిచేసేలా అధికారులు పనిచేస్తున్నారు.

జాగృతం చేసేలా...

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అంటువ్యాధుల పట్ల జాగృతం చేసేలా ఎంటమాలజీ విభాగం సిబ్బంది కరపత్రాలను పంచి అవగాహన కల్పిస్తున్నారు. చెరువులు, నాలాల్లో ఎలాంటి వ్యర్థాలు, పాడైన వస్తువులు వేయకుండా ప్రజలు సహకరించాలని బల్దియా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.

ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారానికి సినిమా హంగులు

Last Updated : Nov 3, 2020, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.