ETV Bharat / state

బస్తీమే సవాల్: గులాబీ తోటలో వికసించేందుకు కమలనాథుల వ్యూహాలు...

author img

By

Published : Jan 11, 2020, 6:02 PM IST

Updated : Jan 11, 2020, 7:09 PM IST

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో పాగా వేసేందుకు మున్సిపల్‌ ఎన్నికలను అవకాశంగా తీసుకోవాలని భావిస్తున్నారు. అన్ని మున్సిపాలిల్లోని ప్రతి వార్డులో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన భాజపా... కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుని సత్తా చాటాలని భావిస్తోంది. గులాబీ తోటలో కమలాన్ని వికసింపజేసి 2023 ఎన్నికల్లో తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలవాలని పావులు కదుపుతున్నారు.

BJP drills to win in telangana municipal elections
BJP drills to win in telangana municipal elections

గులాబీ తోటలో వికసించేందుకు కమలనాథుల వ్యూహాలు...

మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ప్రతి వార్డులో ఒంటరిగా బరిలోకి దిగుతామని ఇప్పటికే భాజపా రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. గత మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రభావం చూపించిన నగరపాలికలతో పాటు బలంగా ఉన్న చోట, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత పెద్ద ఎత్తున తెరాస, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు భాజపా గూటికి చేరారు. ఈ ఎన్నికల్లో పాత, కొత్త నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే భాజపా విజయదుందుభి మోగించడం ఖాయమని కమలనాథులు భావిస్తున్నారు.

సీనియర్లతో క్లస్టర్లపై దృష్టి...

లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు చవిచూసిన భాజపా నాయకులు... పురపోరులోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్​ను మినహాయించి... మిగిలిన 15 పార్లమెంట్ స్థానాలను 15 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్​కు పాత, కొత్త నేతలతో కమిటీలు వేశారు. ప్రతి క్లస్టర్‌కు ఒక సీనియర్ నేతను పరిశీలకుడిగా నియమించారు. భాజపా ఎంపీ స్థానాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ క్లస్టర్లపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది.

కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి...

తెరాస పట్ల ప్రజల్లో వ్యతిరేకత, భాజపా వికసిస్తుందనడానికి 4 ఎంపీ స్థానాలు గెలవడమే నిదర్శనమని చెబుతూ వస్తోన్న కమలనాథులకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. కరీంనగర్‌, ఆదిలాబాద్, నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో గెలిచిన భాజపా వాటి పరిధిలోని మున్సిపాల్టీలను కచ్చితంగా గెలిచితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ అక్కడ ప్రభావం చూపకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రభావం పడనుండటం వల్ల కసరత్తు ప్రారంభించారు.

కేంద్ర నిర్ణయాలు కలిసివస్తాయా...?

దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై ఏ మాత్రం ఉండదని భాజపా నేతలు చెబుతున్నారు. సీఏఏ పైన పట్టణ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పిస్తే కలిసివస్తోందని భావిస్తున్నారు. కేంద్రం తీసుకున్న జమ్మూకశ్మీర్‌ 370 ఆర్టికల్ రద్దు, ముమ్మార్‌ తలాక్‌, రామమందిరం నిర్మాణానికి లైన్‌క్లియర్‌, సీఏఏ వంటి నిర్ణయాలు వల్ల అనుకూల ఫలితాలు వస్తాయని యోచిస్తున్నారు.

కాంగ్రెస్​ కంటే ఎక్కువ సీట్ల కోసం...

2023లో తెలంగాణలో అధికారం భాజపాదేనని ప్రజలకు నమ్మకం కలగాలంటే.. మున్సిపల్ ఎన్నికలను ఆయుధంగా మలచుకోవాలని కాషాయదళం నిర్ణయించుకుంది. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మున్సిపాలిటీలను గెలిస్తేనే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని భావిస్తోంది. తెరాసకు దీటుగా ఫలితాలు తీసుకురావాలని రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల ప్రచారానికి అవసరమైతే కేంద్ర మంత్రులతో పాటు జాతీయ నేతలను పంపిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

Intro:Body:Conclusion:
Last Updated : Jan 11, 2020, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.