ప్రస్తుతం భారత్ది పద్మవ్యూహంలో అభిమన్యుడి పరిస్థితి అని.. చైనా చుట్టుముడుతోందని విశ్రాంత మేజర్ జనరల్, మాజీ అదనపు సర్వేయర్ జనరల్ రమేశ్ సి పధి చెప్పారు. అందులోంచి బయటపడాలంటే రక్షణ రంగాన్ని పటిష్ఠం చేసుకోవాలన్నారు. ఆ రంగంలో శాస్త్ర, సాంకేతికతను మరింత అందిపుచ్చుకోవడానికి ప్రస్తుతం కనిపిస్తున్న ఆధారం అమెరికా మాత్రమేనని అభిప్రాయపడ్డారు. చైనాను తట్టుకోవాలంటే అమెరికా సహకారం చాలా అవసరమని.. అలాగని పాత మిత్రుడైన రష్యాతో సంబంధాలను జాగ్రత్తగా కొనసాగించటం కేంద్రానికి సవాలేనని చెప్పారు. భారత్-అమెరికా రక్షణ సంబంధాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన బుధవారం ఈనాడు ముఖాముఖిలో మాట్లాడారు.
ప్ర. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల్లో చైనా పట్టును పెంచుకునే ప్రయత్నాన్ని మన దేశ రక్షణ విషయంలో ఎలా చూడాలి?
జ. ప్రస్తుతం భారతదేశం పరిస్థితి పద్మవ్యూహంలో అభిమన్యుడి మాదిరిగా ఉంది. భారతదేశాన్ని చైనా శత్రువుగానే భావిస్తోంది. మన చుట్టూ ఉన్న దేశాల్లో వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని చైనా ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. ఈ పరిణామాలను తక్కువగా అంచనా వేయటం మంచిది కాదు.
ప్ర. అమెరికాతో రక్షణ సంబంధాలు పెరుగుతున్న పరిస్థితుల్లో రష్యాతో సంబంధాల గురించి ఏమంటారు?
జ. రష్యాతో సంబంధాలు చాలా సున్నితమైనవి. రక్షణ రంగంలో మన దేశానికి రష్యా పాత మిత్రుడు. అమెరికా-చైనా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అమెరికా-రష్యా మధ్యా అదే పరిస్థితి. ఈ దశలో రష్యాతో సమతుల్యత పాటించటం మనకు పెద్ద సవాలే. ఇరాన్ను కూడా మనం విస్మరించకూడదు.
ప్ర. చైనాను తట్టుకునేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా?
జ. వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. చైనా ఆర్థికంగా అమెరికాను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఆసియాలో భారత్కు పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో చైనాతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. అమెరికాతో 2016 నుంచి కీలకమైన ఒప్పందాలను చేసుకుంది.
ప్ర. మునుపటి ఒప్పందాలు ఫలితాన్ని ఇస్తున్నాయా?
జ. నిస్సందేహంగా ఫలితం కనిపిస్తోంది. అమెరికా నుంచి రక్షణ రంగానికి సంబంధించిన కొనుగోళ్లలో భారతీయ కంపెనీల భాగస్వామ్యాన్ని కేంద్రం అనివార్యం చేసింది. దీంతో చాలా కంపెనీలు మన దేశ సంస్థల భాగస్వామ్యంతో ఇక్కడ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఒప్పందాలతో భవిష్యత్తులో పెద్దస్థాయిలో రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్ర. ఉద్రిక్తతల సమయంలో ఆయుధాలను సరఫరా చేసే దేశాలు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలపై మీరేమంటారు?
జ. నిజమే, ఆ దోపిడీ దారుణంగా ఉంటుంది. అవసరం మనదైనప్పుడు వ్యాపారిది ధోరణి అలాగే ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేమి కూడా ఈ పరిస్థితికి ఓ కారణం. కార్గిల్ యుద్ధ సమయంలో అదే జరిగింది. ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉంటాయి.. కానీ, దేశం కోసం పోరాడుతున్న సైనికులను ఆదుకునేందుకు చేతులు రావు.
ప్ర. మునుపటితో పోలిస్తే సైనికులకు సదుపాయాలు మెరుగయ్యాయని ప్రభుత్వం చెబుతోంది కదా?
జ. వినేవాళ్లు ఉంటే చెప్పే వాళ్లు ఎన్నైనా చెబుతారు. ఇటీవల ‘విజయ్ దివస్’ జరిగింది. కేంద్రం ఏ మేర పట్టించుకుంది? జరిగిన కార్యక్రమాలు మాజీ ఉద్యోగులు చేసినవే. సైనికుల నుంచి అధికారుల వరకు వైద్య సదుపాయాలు ఎక్కడ?. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి.
ప్ర. రక్షణ రంగ హబ్గా హైదరాబాద్ మారుతోంది. కొన్ని పరిశ్రమలను కేంద్రం తరలిస్తోందన్న ప్రచారం జరుగుతోంది?
జ. అందులో కేంద్రం పాత్ర కొంత మేరకే. దేశంలో భాజపా ప్రభుత్వం ఉంది. ఉత్తరప్రదేశ్లో కూడా ఆ పార్టీ ప్రభుత్వమే ఉంది. డిఫెన్స్ కారిడార్గా ఓ ప్రాంతాన్ని ప్రకటించింది. అక్కడ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ లేదు. హైదరాబాద్కు చాలా సంస్థలు వచ్చాయి. తమిళనాడుకూ వస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటులో రాష్ట్రాలు చూపే చొరవే కీలకం. రాయితీలకు పెద్దపీట వేస్తే ఫలితాలు ఉంటాయి.